దిగ్భ్రాంతికి గురిచేసేలా: మహిళలపై కాంగ్రెస్ నేత వివాదస్పద కామెంట్స్!
శరీరం మలినంగా ఉన్నప్పుడు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు వారు వెళ్లకపోవడమే మంచిదని కేరళ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేవిగా మారాయి.
త్రివేండ్రం: కేరళ కాంగ్రెస్కు తాత్కాళిక పీసీసీ చీఫ్గా నియమితులైన ఎంఎం హసన్.. పదవి చేపట్టిన వెంటనే మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు పట్టుబట్టి మరీ ఆ పదవి ఇప్పించుకున్న మాజీ సీఎం ఉమెన్ చాందీని సైతం తప్పుపట్టే పరిస్థితి తలెత్తింది.
మహిళల రుతుస్రావం అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంఎం హసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఆధ్యాత్మిక ఆలయ ప్రదేశాల్లోకి వారిని అనుమతించకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు.
మహిళలను రుతుస్రావం సమయంలో ఆలయాల్లోకి రానివ్వకూడదని, దీని వెనుక ఓ సైంటిఫిక్ కారణం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదని, రుతుస్రావం సమయంలో మహిళలు ఉపవాసం కూడా ఉండరాదని చెప్పారు. శరీరం మలినంగా ఉన్నప్పుడు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు వారు వెళ్లకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. ఎంఎం హసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేవిగా మారాయి.