జిఎస్టీ దెబ్బకే విలవిల: ఇక అంతర్జాతీయ పన్ను?
పూణే: ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజల నెత్తిన మరో పన్ను భారం మోపే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. జిఎస్టీ రూపంలో ఇప్పటికే ఓ పన్ను భారం మోపిన ప్రభుత్వం గ్లోబల్ ట్యాక్స్ పేర మరో పన్ను వేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
అర్ఎస్ఎస్ అనుకూల సంస్థ అర్థక్రాంతి సూచన మేరకే ప్రధాని మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి యావత్తు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అర్థరాత్రి అకస్మాత్తుగా ప్రకటన చేశారు. వేయి, 500 రూపాయల నోట్లను రద్దు చేశారు.
వన్ కరెన్సీ, వన్ వరల్డ్ అవసరం...
ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి వన్ కరెన్సీ, వన్ వరల్డ్ అవసరమని అర్థక్రాంతి వ్యవసస్థాపకుడు అనిల్ బోకిల్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వెనక ఉంది కూడా ఆయనే. ప్రవంచాన్ని ముందుకు నడిపించడానికి ఒకే కరెన్సీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. లావాదేవీల్లో పారదర్శకత ఉండాలని, బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. లావాదేవీల ఫుట్ ప్రింట్స్ తయారు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆయన ఇలా...
ప్రస్తుత ఆర్థిక విధానం, కస్టమర్లు అనే అంశంపై అఖిల భారత కస్టమర్ల పంచాయత్ ఏర్పాటు చేసిన సమావేశంలో శుక్రవారం ఆయన కీలకోపన్యాసం చేశారు. పెద్ద నోట్లరద్దు సానుకూల ప్రభావం వచ్చే రోజుల్లో కకనిపిస్తుందని ఆయన చెప్పారు. అవినీతిని, నల్లధనాన్ని, ఉగ్రవాదులకు నిధుల పంపిణీలను అరికట్టడానికి ఆ చర్య ఉపయోగపడుతుందని చెప్పారు.
సంస్కరణ దిశలో తొలి అడుగు...
వస్తు సేవా పన్ను (జిఎస్టీ) ఆర్థిక సంస్కరణల్లో తొలి అడుగు అని అనిల్ బోకిల్ చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం విధానాలను సంస్కరిస్తూ వెళ్లాలని ఆయన అన్నారు. గ్లోబల్ ట్యాక్స్ వేసే ప్రతిపాదనను పరిశీలించాలని తాను ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. అది వాతావరణ మార్పు, ఉగ్రవాదం వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆహార కొరతకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పనికి వస్తుందని అన్నారు. ఇంకా ఇతర ప్రయోనాలు కూడా ఉంటాయని అన్నారు.
గ్లోబల్ ట్యాక్స్తో ప్రపంచ భద్రత
అమెరికా, ఐరోపా దేశాలు ఇచ్చే 80 శాతం నిధులతో యుఎన్ఓ నడుస్తోందని, అందువల్ల అది ఆ దేశాల ప్రయోజనం కోసమే పనిచేస్తుందని, మిగతా ప్రపంచం గురించి అది పట్టించుకోదని, గ్లోబల్ ట్యాక్స్ వేస్తే గ్లోబల్ సెక్యూరిటీ సాధ్మమవుతుందని అనిల్ బోకిల్ అన్నారు.