ముంబై టూ న్యూయార్క్: స్మగ్లింగ్ చేస్తున్న పైలెట్
ముంబై/న్యూయార్క్: ముంబై నుంచి అక్రమంగా అమెరికాకు నగదు తరలిస్తున్న పైలెట్ ను అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మంగళవారం అధికారులు వివరాలు వెల్లడించారు. టెక్సాస్ కు చెందిన ఆంటోనీ వార్నర్ (55) ఓ కమర్షియల్ పైలెట్.
ఇతను వేరే విమానంలో ముంబై నుంచి న్యూయార్క్ కు భారీగా డాలర్లు తరలించడానికి ప్రయత్నించాడు. న్యూయార్క్ లోని లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో ఆంటోనీ వార్నర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అతని ల్యాప్ టాప్ బ్యాగ్ లో దాచి పెట్టిన రెండు లక్షల యూఎస్ డాలర్లతో పాటు భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంటోనీ వార్నర్ ను అధికారులు ప్రశ్నించారు. అయితే అతను పొంతనలేని సమాచారం ఇచ్చాడని అధికారులు అన్నారు.
సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆంటోనీని అరెస్టు చేశామని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు ఈ కేసు విచారణ చేస్తున్నారు. నేరం రుజువు అయితే ఆంటోనీ వార్నర్ కు దాదాపు ఐదేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ముంబై నుంచి న్యూయార్క్ కు ఆంటోనీ వార్నర్ ఏ విమాన సంస్థలో ప్రయాణించాడనే విషయం చెప్పడానికి అధికారులు నిరాకరించారు. విషయం తెలుసుకున్న ముంబై విమానాశ్రయం అధికారులు రెండు లక్షల డాలర్లు ఎలా తీసుకు వెళ్లాడని ఆరా తీస్తున్నారు.