మేం గుర్తించలేదు: కోవింద్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా ఆగ్రహం
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత్ ధీటుగా స్పందించింది. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అరుణాచల్లో పర్యటించారు.
బీజింగ్/న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత్ ధీటుగా స్పందించింది. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అరుణాచల్లో పర్యటించారు.
చదవండి: మా ప్రాంతం, మా ఇష్టం: చైనాకు భారత్ దిమ్మతిరిగే సమాధానం
దీనిపై చైనా మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలక దశలో ఉన్న సందర్భంలో వాటిని మరింత క్లిష్టతరం చేసేలా భారత్ వ్యవహరిస్తోందని ఆగ్రహించింది. కోవింద్ అరుణాచల్లో ఆదివారం పర్యటించారు.
ఎప్పుడూ ధ్రవీకరించలేదు
అరుణాచల్ ప్రదేశ్గా పిలవబడే ప్రాంతాన్ని తాము ఎప్పుడూ స్పష్టంగా ధ్రువీకరించలేదని, సరిహద్దు అంశంపై తాము స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాంగ్ అన్నారు. అరుణాచల్ను దక్షిణ టిబెట్ ప్రాంతంగా చైనా భావిస్తోంది. అంతేకాకుండా భారత్ ఉన్నతాధికారి ఆ ప్రాంతానికి వెళ్లిన ప్రతిసారీ చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది.
పెండింగ్ సమస్యపై శాంతియుతంగా ముందుకు
ఈ సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ జరుగుతోందని, న్యాయమైన, సహేతుకమైన పరిష్కారం లభిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని లూకాంగ్ అన్నారు. పెండింగులో ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలు శాంతియుతంగా పని చేయాలన్నారు.
అప్పుడే మార్గం సుగమం
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగేలా భారత్ పని చేస్తుందని భావిస్తున్నట్టు లూకాంగ్ తెలిపారు. అప్పుడే సంప్రదింపులు సజావుగా జరిగేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.
ఇప్పటికి 19సార్లు చర్చలు
నవంబర్ 6న నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో పర్యటించిన సందర్భంలోనూ చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు 19సార్లు చర్చలు చర్చించారు. 20వ రౌండ్ చర్చలు ఢిల్లీలో డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.