లుక్ఔట్: దేవయానిపై నిషేధం, ఆమెరికా పెద్దల ఆగ్రహం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత దౌత్యకారిణి దేవయాని మళ్లీ అమెరికాలో ప్రవేశించకుండా ఆ దేశం నిషేదం విధించింది. సాధారణ ప్రక్రియ మాదిరాగ వీసా మంజూరు చేయకుండా వీసా, ఇమ్మిగ్రేషన్ అప్రమత్తత వ్యవస్థలో ఆమె పేరును చేరుస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకీ వెల్లడించారు.
దేవయానికి రొటీన్గా వీసా మంజూరు చేయకుండా చూడడం కోసం ఆమె పేరును వీసా, ఇమిగ్రేషన్ లుకౌట్ సిస్టమ్లో ఉంచనున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు చెప్పడంతో అమెరికా ప్రభుత్వం బహిష్కరించిన ఆమె అమెరికాలో తిరిగి అడుగుపెట్టకుండా చేసినట్లయింది. దేవయాని అమెరికా వదిలిపెట్టి వెళ్లినప్పటికీ ఆమెపై మోపిన అభియోగాల్లో ఎలాంటి మార్పూ ఉండదని జెన్ సాకీ శుక్రవారం చెప్పారు.
ఆమె దేశం వదిలి పెట్టివెళ్లినందున ఆమె అరెస్టుకు వారెంట్ జారీ చేయడం జరుగుతుందని సాకీ తెలిపారు. సాకీ చెప్పిన మాటలను బట్టి దేవయానిని అమెరికా ప్రభుత్వం దేశంలోకి అనుమతించకూడని వ్యక్తిగా పరిగణిస్తోందని, కోర్టు ముందు విచారణను ఎదుర్కోవడం కోసం మాత్రమే ఆమెను అమెరికాలో అడుగుపెట్టడానికి అనుమతించవచ్చని స్పష్టమవుతోంది.
దేవయానిని దేశం వదిలిపెట్టి వెళ్లమని ఆదేశించినందుకు ప్రతీకారంగా తమ దౌత్యఅధికారి ఒకరిని భారత ప్రభుత్వం బహిష్కరించడం పట్ల సాకి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా సంబంధాల్లో ఇది ఒక పరీక్షా సమయమని ఆమె అంటూ, ఈ సంబంధాలు ఇంతటితో ముగియకూడదని, సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, తిరిగి మరింత నిర్మాణాత్మక దశకు చేరుకునేందుకు భారత్ గణనీయమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆమె చెప్పారు.
కాగా, భారత్ వచ్చిన దేవయాని.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దేవయాని కేసులో భారత్ తన దృఢవైఖరి ఇలాగై కొనసాగిస్తుందని, ఆమెపై నేరాభియోగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాను డిమాండ్ చేస్తామని ఖుర్షీద్ తెలిపారు.
పెద్దల ఆగ్రహం
దేవయానిపై కేసు పెట్టడం వల్ల భారత్తో సంబంధాలపై ప్రభావం పడిందని గుర్తించిన అమెరికా అగ్రనాయకత్వం.. ఈ కేసును అత్యంత అవివేకమైన చర్యగా అభిప్రాయపడింది. సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మళ్లీ కష్టపడాలన్న భావనకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఒబామా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ వచ్చారు. దేవయాని అరెస్టు విషయం తెలిసిన వెంటనే భారత్ ఎంత ఆగ్రహానికి గురయిందో అమెరికా అగ్రనాయకత్వం కడా అంతే ఆగ్రహానికి గురయిందట.