మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదేళ్లకు రూ. 520 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు ఓకె
న్యూయార్క్/ముంబై: మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదేళ్లకు రూ. 520 కోట్ల(84 మిలియన్ డాలర్లు) ప్యాకేజీ ఇచ్చేందుకు కంపెనీ షేర్ హోల్డర్లు అంగీకరించారు. ఆయన ఈ మొత్తం తీసుకునేందుకు అర్హుడేనని షేర్ హోల్డర్లు తమ ఓటుతో చెప్పారు. కంపెనీ నాదేళ్లకు అత్యధిక ప్యాకేజీ చెల్లిస్తోందని ఓ ఇన్వెస్టర్ అడ్వైజరీ గ్రూప్ పేర్కొన్న నేపథ్యం ఈ ఓటింగ్ నిర్వహించారు.
కాగా, ఈ ప్యాకేజీతో సత్య నాదేళ్ల నిరుడు అత్యధిక ప్యాకేజీ అందుకున్న సిఈఓల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 72శాతం షేర్ హోల్డర్లు నాదేళ్లకు ఆ ప్యాకేజీని ఇవ్వడం సబబేనని తమ ఓట్లతో తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో ఈ ఓటింగ్ నిర్వహించారు. 70శాతం ఒక్క ఓటు తక్కువగా వచ్చిన విధానాలను పునర్ సమీక్షించాలని చాలా కంపెనీల సిఈఓల ప్యాకేజీని పర్యవేక్షిస్తున్న సంస్థ ఐఎస్ఎస్ పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సత్య నాదేళ్లకు ఈ మొత్తం ప్యాకేజీ ఇవ్వడం సమంజసమని షేర్ హోల్డర్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ నిపుణులు కూడా అంగీకరించారు. 18వేల మంది ఉద్యోగులను తొలగించి సంస్థకు వేలకోట్ల ధనాన్ని సమకూర్చాడని బిజిసి ఫైనాన్షియల్ కోలిన్ గిల్లిస్ పేర్కొన్నారు. అంతేగాక మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర ఈ ఏడాది 30శాతం పెరిగిందని చెప్పారు. నివేదికల సమర్పణలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెప్పారు.
2011లో యాపిల్ సిఈఓ నియమితమైన టిమ్ కుక్తో పోల్చితే మొదటి ఏడాదికి 378 మిలియన్ డాలర్లు(సుమారు 2,340 కోట్లు) కంటే కొంచెం తగ్గింది. నిరుడు ఓరాకిల్ సిఈఓ లారీ ఎలిసన్ 67.3మిలియన్ డాలర్లు(రూ. 416 కోట్లు) అందుకున్నారు. 2013లో మాజీ మైక్రోసాఫ్ట్ సిఈఓ స్టీవ్ బల్మర్ కేవలం 1.3 మిలియన్(సుమారు 8కోట్లు) మాత్రమే పొందారు. ఆయన 16బిలియన్ డాలర్లు(రూ. 99,055కోట్లు) షేర్లను నిర్వహించారు.
కాగా, ప్రపంచ స్థాయి సిఈఓను ఆకర్షించే ఈ ప్యాకేజీ ఇవ్వడం సమంజసమేనని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ జాన్ థామ్సన్ తెలిపారు. కంపెనీ లాభాలను, దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తున్న సిఈఓకు తగిన మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉందని తెలిపారు.