భారత కాన్సులేట్పై దాడి: 4గురు ఉగ్రవాదుల హతం
జలాలాబాద్: ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జలాలాబాద్లో ఉన్న భారతీయ దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఓ సుసైడ్ బాంబర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టబెట్టాయి.
పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిన జలాలాబాద్లో ఓ సాధారణ పౌరుడు మృతిచెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దౌత్య కార్యాలయంలో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారతీయ దౌత్య కార్యాలయాన్ని నలుగురు సుసైడ్ బాంబర్లు లక్ష్యం చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
బుధవారం మధ్యాహ్నం కౌన్సులేట్ ఆవరణలోకి ఓ ఉగ్రవాది గ్రేనేడ్ను విసిరినట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్ధాలు మోగడంతో ఆ ప్రాంతాన్ని వెంటనే భద్రతా దళాలు చుట్టుముట్టాయి. సాధారణ పౌరులు అక్కడి నుంచి హుటాహుటిన తరలివెళ్లారు. ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు దౌత్య కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నారు.
దౌత్య కార్యాలయానికి దగ్గర్లో ఉన్న గెస్ట్ హౌజ్ నుంచి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఆ కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. పేలుడు వల్ల సమీప భవనం దెబ్బతింది. ఆ బిల్డింగ్ కిటికీలు, డోర్లు ధ్వంసం అయ్యాయి. మరో ఎనిమిది కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కాగా, దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. భారత్ తోపాటు ఇతర దేశాల దౌత్య కార్యాలయాలున్న ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు తరచూ టార్గెట్ చేస్తుండటం అక్కడి భద్రతాదళాలు, అధికారులను ఆందోళక గురిచేస్తోంది.