భారత్ పై యుద్ధానికి సిద్ధమైన చైనా.. టైం కూడా చెప్పేసింది!
డోక్లాం ప్రాంతం నుంచి భారత భద్రతా దళాలను వెనక్కి నెట్టేందుకే చైనా సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అందుకోసం చిన్నపాటి మిలటరీ ఆపరేషన్లు సైతం చేపట్టాలని డ్రాగన్ కాలుదువ్వుతున్నట్టు సమాచారం.
బీజింగ్: డోక్లాం ప్రాంతం నుంచి భారత భద్రతా దళాలను వెనక్కి నెట్టేందుకే చైనా సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అందుకోసం చిన్నపాటి మిలటరీ ఆపరేషన్లు సైతం చేపట్టాలని డ్రాగన్ కాలుదువ్వుతున్నట్టు సమాచారం.
ఈ మేరకు చైనా అధికారిక వార్తాపత్రిక 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనం ప్రచురించింది. రెండువారాల్లోగా భారత సైనికులను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు చైనా సిద్ధమవుతున్నట్టు పేర్కొంది.
రెండు వారాల్లోగా వెనక్కి వెళ్లిపోవాలి...
చైనా.. భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. రెండు వారాల గడువు పెట్టింది. ఈ రెండు వారాల్లోగా డోక్లాం ప్రాంతం నుంచి భరత భద్రతా దళాలు వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరిశోధకుడు హు జియాంగ్ రాసిన వ్యాసాన్ని చైనా అధికారిక వార్తాపత్రిక ‘గ్లోబల్ టైమ్స్' ప్రచురించింది.
చిన్నపాటి మిలటరీ ఆపరేషన్లకూ సిద్ధం...
‘‘డోక్లాంలో ఎక్కువ కాలం భారత దళాల మోహరింపును చైనా ఉపేక్షించే అవకాశం లేదు. రెండు వారాల్లోగా భారత దళాలను అక్కడ్నించి ఖాళీ చేయించేందుకు అవసరమైతే చైనా చిన్నపాటి మిలటరీ ఆపరేషన్లు చేపట్టవచ్చు...'' అని హు జియాంగ్ గ్లోబల్ టైమ్స్ లో తాను రాసిన కథనంలో వ్యాఖ్యానించారు. ఈ సైనిక చర్యలకు ముందు భారత విదేశాంగ శాఖకు చైనా సమాచారం కూడా ఇస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.
ట్రైజంక్షన్ వద్ద రోడ్డు నిర్మాణమే వివాదం...
సిక్కిం సెక్టార్లోని భూటాన్ ట్రైజంక్షన్ వద్ద రోడ్డు నిర్మించేందుకు చైనా సైనికులు ప్రయత్నించడంతో భారత్ అభ్యంతరం తెలిపింది. రోడ్డు నిర్మించి తీరతామని చైనా, వీల్లేదని భారత్... ఇలా జూన్ 16 నుంచి ఇరుదేశాల సైనికులు డోక్లాం వద్ద మోహరించాయి. మరోవైపు భూటాన్ కూడా చైనా రోడ్డు నిర్మించడాన్ని వ్యతిరేకించింది. అది తమ భూభాగమనీ.. సరిహద్దు వివాదం ముగిసే వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టరాదన్న ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తోందని ఆరోపించింది.
50 రోజులుగా ప్రతిష్టంభన..
డోక్లాంలో ప్రతిష్టంభన శుక్రవారంతో 50 రోజులకు చేరుకుంది. నేపథ్యంలో చైనా విదేశాంగ, రక్షణశాఖలు విడివిడిగా ప్రకటనలు విడుదల చేశాయి. భారత్ బలగాలు ముందుకు చొచ్చుకు రావడాన్ని ఎంతమాత్రం సహించబోమని చెప్పడం ఈ ప్రకటనల ఉద్దేశమంటూ విదేశీ వ్యవహారాల నిపుణుడు హు ఝియోంగ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘గ్లోబల్ టైమ్స్' కథనం ప్రచురించింది. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని.. డోక్లాంలో ప్రతిష్టంభనపై తాము ఇన్నాళ్లూ చాలా నిగ్రహంతో ఉన్నామని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి రెన్ గ్వొకియాంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, నిగ్రహానికి కూడా ఓ హద్దుంటుందని వ్యాఖ్యానించారు.
భారత్ ఆందోళన అదే... యుద్ధానికీ సిద్ధమే
చైనా ఏకపక్షంగా రోడ్డు నిర్మాణం చేపట్టిందనీ... యథాతథ స్థితి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ కూడా వాదిస్తోంది. సిక్కిం సెక్టార్లోని భూటాన్ ట్రైజంక్షన్ వద్ద రోడ్డు నిర్మాణం చేపడితే ఈశాన్య రాష్ట్రాల్లోకి రాకపోకలకు విఘాతం కలుగుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా నిర్మాణాలను అడ్డుకోవాలని భావిస్తోంది. అందుకే చైనా ఎంతగా బెదిరిస్తున్నా భారత్ ఖాతరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో చైనా చిన్నపాటి సైనిక చర్యకు దిగినా దానిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సంసిద్ధంగా ఉంది.