అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులు
ఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.100, అంతకంటే తక్కువ కరెన్సీ మాత్రమే ఇక చెల్లుబాటు కానుంది. అంటే భారత కరెన్సీలోని రూ.2000, రూ.500, రూ.200 నోట్లను రద్దు చేసింది. ఇది నేపాల్ వెళ్లే భారత పర్యాటకులకు ఇబ్బంది కలిగించే అంశం.
ఈ నోట్లు చెల్లవు
భారత్ కరెన్సీకి చెందిన రూ.100 కంటే పెద్ద నోట్లు చెల్లబోవని నేపాల్ సెంట్రల్ బ్యాంకు (నేషనల్ రాష్ట్ర బ్యాంకు) ఆదివారం నాడు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేపాలీ ట్రావెలర్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్కు నోటీసులు జారీ చేసింది. ఈ పెద్ద నోట్లను ఎక్కువ విలువ ఉన్న భారత కరెన్సీని ఇక ఉపయోగించరాదని నోటీసుల్లో పేర్కొన్నారు.
వారు వ్యతిరేకిస్తున్నారు
రూ.100 లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన భారత కరెన్సీని మాత్రమే ఉపయోగించేందుకు అనుమతించారు. భారత కరెన్సీలోని రూ.100 కంటే పెద్ద నోట్లపై నిషేధం విధిస్తూ గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నిర్ణయం తీసుకున్నామని నేపాల్ కేబినెట్ గెజిట్ విడుదల చేసింది. అయితే, ఈ నిషేధాన్ని ట్రావెల్ ట్రేడర్లు, వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
రెండేళ్లుగా కొత్త నోట్ల వాడకం
నేపాల్ దేశంలో పర్యటించే భారతీయులు తమ కరెన్సీని డాలర్లు, యూరోల్లో మార్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి నేపాల్. భారత్లో నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.200, రూ.500, రూ.2000 నోట్లు వచ్చాయి. రెండేళ్లుగా నేపాలీలు భారత కొత్త కరెన్సీని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఉపయోగించలేరు.