Nepal Floods: నేపాల్ విషాదంలో బిగ్ ట్విస్ట్- ఏకంగా 35 దేశాలకు షాక్..!
హిమాలయ దేశం నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు (Nepal floods) ఆ దేశాన్నే కాదు ఏకంగా 35 దేశాలకు షాకిచ్చాయి. వర్షం కూడా లేకుండా హఠాత్తుగా విరుచుకుపడ్డ ఈ వరదల ధాటికి ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. దీంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా మారింది. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా మారిన నేపాల్ వరదల్లో అడుగడుగునా ట్విస్టులే కనిపిస్తున్నాయి.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో వచ్చిన భారీ ఆకస్మిక వరదలు, భీకర కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన దేశ విదేశాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్తుల్లో ఇప్పటివరకు 392 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. వరదల ఉధృతికి కొట్టుకుపోయిన సుమారు 1,400 మందికి పైగా ప్రజల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారి వివరాల సేకరణలో గందరగోళం నెలకొనడంతో ఈ సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. విపత్తు చోటు చేసుకున్న సరిహద్దుకు ఇరువైపులా ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. నేపాల్ విపత్తు సహాయక సంస్థ నివేదిక ప్రకారం, ఆ దేశ భూభాగంలో 517 మంది విదేశీయులతో సహా దాదాపు 910 మంది కనిపించకుండా పోయారు. అదే సమయంలో సరిహద్దుకు అవతలి వైపు ఉన్న టిబెట్ పరిధిలో చైనా ప్రభుత్వం 558 మంది గల్లంతైనట్లు ప్రకటించింది. ఇందులో 260 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో భారతీయ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో చిక్కుకుపోయారు. నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత్కు చెందిన 178 మంది ఆచూకీ లభించలేదు. వీరిలో 11 మందిని రెస్క్యూ టీమ్లు ఇప్పటివరకు సురక్షితంగా రక్షించగలిగాయి. పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకున్న ఇతర విదేశీయులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అమెరికాకు చెందిన 90 మంది పౌరులు కూడా గల్లంతైనట్లు అక్కడి విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్కు చెందిన 56 మంది, మలేషియాకు చెందిన 50 మందికి పైగా పౌరులు ప్రస్తుతం ఎటువంటి కమ్యూనికేషన్ లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు చెందిన పదుల సంఖ్యలో పర్యాటకులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, మృతదేహాలను గుర్తించడంలో ఎదురవుతున్న ఇబ్బందులతో గల్లంతైన వారి ఖచ్చితమైన లెక్కలు తేల్చడం కూడా కష్టంగా మారింది.














Click it and Unblock the Notifications