బెదిరించడం ఆపండి: చైనా, అమెరికాకు మళ్లీ ఉ.కొరియా హెచ్చరిక
ఉత్తర కొరియాతో వివాదం నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం అమెరికా ఎంచుకున్న మార్గం సరైంది కాదని చైనా పునరుద్ఘాటించింది. ఉత్తర కొరియాను బెదిరించడం మానుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది.
బీజింగ్: ఉత్తర కొరియాతో వివాదం నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం అమెరికా ఎంచుకున్న మార్గం సరైంది కాదని చైనా పునరుద్ఘాటించింది. ఉత్తర కొరియాను బెదిరించడం మానుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది.
భారీ మానవరహిత యుద్ధ హెలికాప్టర్ను అమ్మకానికి పెట్టిన చైనా
బెదిరించడం మాని, వెంటనే చర్చల ప్రక్రియను ఎంచుకోవాలని అమెరికాకు సూచించింది చైనా. నిజాయితీగా చెప్పాలంటే వివాద పరిష్కారం కోసం వాషింగ్టన్ నాయకత్వం చేయాల్సినంత చేయడం లేదని, చర్చల ప్రక్రియకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించే ప్రక్రియను చేయాలన్నారు.
అమెరికన్లే మద్దతివ్వరు
అప్పుడు అంతర్జాతీయ సహకారం తోడవుతుందని చైనా పేర్కొంది. బెదిరింపుల ధోరణిని పక్కకు పెట్టాలన్నారు. ఉత్తర కొరియా మాదిరి చైనా పైనా ఒత్తిళ్లు తీసుకు వచ్చి, ఆంక్షలు విధించాలని ప్రయత్నిస్తే అందుకు అమెరికన్లే మద్దతివ్వరని చెబుతున్నారు.
బెదిరేది లేదని కిమ్ జాంగ్ ఉన్
మరోవైపు, అంతర్జాతీయ ఆంక్షలకు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని కిమ్ జాంగ్ ఉన్ తేల్చి చెప్పారు. సైనిక పాటవంలో అమెరికాతో సరిసమానం కావడమే లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనకు అతి చేరువలో ఉన్నామని, మరిన్ని క్షిపణి పరీక్షలు చేస్తామని హెచ్చరించారు.
అసలు టార్గెట్..
ఉత్తరకొరియా శుక్రవారం జపాన్ మీదుగా హ్వాసాంగ్ 12 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా, దాని మిత్రదేశాలు, ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి మండిపడ్డాయి. 3,700 కి.మీ. ప్రయాణించిన ఆ క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఇటీవల ఆ దేశం ప్రయోగించిన క్షిపణుల్లోకీ ఇదే శక్తిమంతమైనది, అధిక లక్ష్య ఛేదన సామర్థ్యం కలిగినది. దాని అసలు టార్గెట్ జపాన్లో అమెరికా సైనిక స్థావరం ఉన్న దీవి కావడంతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా కలవరపడుతున్నాయి. ఐక్య రాజ్య సమితి అపరిమిత ఆంక్షలు విధించినా అణ్వాయుధ బలగాన్ని నిర్మించడం పూర్తయిందని కిమ్ తెలిపారు.
మరిన్ని ప్రయోగాలు
సైనిక శక్తితో మనల్ని ఢీకొట్టాలన్న దుస్సాహసానికి అమెరికా పాలకులు ఒడిగట్టకుండా చేయడమే మన తుది లక్ష్యమని, మున్ముందు మరిన్ని క్షిపణి ప్రయోగాలు జరుపుతామని, అణ్వస్త్ర శక్తిగా పోరాట సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకునే విధంగా భవిష్యత్ పరీక్షలన్నీ జరుగుతాయని, అసలు యుద్ధానికి అణు వార్హెడ్ల మోహరింపునకు ఓ వ్యవస్థను తీర్చిదిద్దడమే వీటి ధ్యేయమని కిమ్ జాంగ్ ఉన్న ప్రకటించారు. భయంకర అణుదాడి హెచ్చరిక కూడా చేశారు.