సంచలనం: భారత్ పై దాడికి.. అణుబాంబులు రెడీ: పాక్ ప్రధాని
పాకిస్తాన్ మరోసారి భారత్పై విషం కక్కింది. భారత్ను ఎదుర్కొనేందుకే చిన్నతరహా అణ్వాయుధాలను తయారుచేశామంటూ పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్: ఇంటిని చక్కబెట్టుకోవాలంటూ అంతర్జాతీయ సమాజం చీవాట్లు పెట్టినా పాకిస్తాన్ తీరు ఏమాత్రం మారడం లేదు. దేశం నిండా ఉగ్రవాదం ఊడలు పరుచుకున్నది మర్చిపోయిన పాకిస్తాన్ మరోసారి భారత్పై విషం కక్కింది.
భారత్ను ఎదుర్కొనేందుకే చిన్నతరహా అణ్వాయుధాలను తయారుచేశామంటూ పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్ అబ్బాసీ.. ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ భేటీలో మాట్లాడిన సందర్భంగా ఇలా మాట్లాడారు.
భారత్ ‘కోల్డ్ స్టార్ట్’ను ఎదుర్కొనేందుకే...
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చొచ్చుకునిపోయి భారత్ బలగాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. దీనికి ప్రతీగా భారత్పై దాడులు జరపాలన్న కసితో ఉంది. అయితే, భారత్ వేస్తున్న ఎత్తుల ముందు పాక్ దాడి చేసేందుకు ఏమాత్రం సాహసం చేయలేక పోతోంది. అయితే, భారత్పై అణ్వస్త్ర దాడికి దిగితే లాభలనష్టాలపై బేరీజు వేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ రూపొందించిన ‘కోల్డ్ స్టార్ట్' సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకు తాము స్వల్ప శ్రేణి అణు ఆయుధాలను తయారుచేసినట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసీ తెలిపారు. మిగతా వ్యూహాత్మక ఆయుధాలను నియంత్రిస్తున్న న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్(ఎన్ఏసీ) అథారిటీకే ఈ అణ్వాయుధాల నియంత్రణ బాధ్యతలు కూడా అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఏమిటీ ‘కోల్డ్ స్టార్ట్’ సిద్ధాంతం?
పాకిస్తాన్తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్' సిద్ధాంతాన్ని రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఇది. ఈ యుద్ధ వ్యూహం ప్రకారం ఏకీకృత నాయకత్వం ఆధ్వర్యంలో సైన్యం చిన్నచిన్న బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహిస్తుంది. చూసే వాళ్లకు అది యుద్ధంగా కనిపించకుండా యుద్ధం చేస్తుంది. పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని భయపడి పూర్తిగా యుద్ధం మానుకోనక్కర్లేదు. ఏ స్థాయిలో పాక్కు నష్టం కలిగిస్తే పాక్ అణ్వస్త్ర ప్రయోగానికి దిగుతుందో అంచనావేసి, అంతకంటే కొంత తక్కువ స్థాయిలో నష్టం కలిగించేలా భారత యుద్ధం చేయవచ్చు, అప్పుడు పాక్ అణ్వస్త్ర దాడి చేయబోదు అనేది ‘కోల్డ్ స్టార్ట్' సిద్ధాంతంలోని ప్రధానాంశం.
మరి, నియంత్రణ సామర్థ్యం?
నిజానికి ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేసినంత మాత్రాన సరిపోదు, వాటిని నియంత్రించగలిగే న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్(ఎన్సీఏ) అథారిటీ కూడా ఉండాలి. అగ్రరాజ్యం అమెరికా ఆందోళన ఈ అంశం గురించే. ప్రస్తుతం ఉత్తరకొరియా దగ్గరున్న అణ్వస్త్రాలు మరే దేశంలోనూ లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని నిర్వహించగల సామర్థ్యం ఆ దేశానికి ఉందా? అన్న దిగులే ఇప్పుడు అమెరికాను వెంటాడుతోంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ప్రధాని సైతం.. తాము కూడా అణ్వస్త్రాలను తయారు చేస్తున్నట్లు, అవి కూడా భారత్ ను ఎదుర్కోవడం కోసమే.. అని ప్రకటించడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఎందుకంటే, అణ్వస్త్రాలను తయారు చేసిన దేశానికి వాటిని నిర్వహించే, నియంత్రించగలిగే కమాండ్ కంట్రోల్ అథారిటీ కూడా ఉండి తీరాలి.
అవును, ఆ సామర్థ్యం మాకుంది...
పాకిస్తాన్కు అణ్వాయుధాలను నిర్వహించగల సామర్థ్యంపై కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ మోడరేటర్ డేవిడ్ సంగర్ సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే ఉత్తరకొరియా అణ్వస్రాలు పరీక్షిస్తూ రెచ్చిపోతోంది. ప్రపంచంలో ఉత్తరకొరియా దగ్గరున్న అణ్వాయుధాలు ప్రస్తుతం ఏ దేశంలో కూడా లేవు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు తయారు చేశామంటోంది.. ఈ పరిస్థితులు మున్ముందు ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తాయో..'' అని ఆయన పేర్కొనగా, దీనికి పాక్ ప్రధాని షాహిద్ ఖాకస్ అబ్బాసీ వివరణ కూడా ఇచ్చారు. ‘‘మా వ్యూహాత్మక అణు ఆయుధాలను పర్యవేక్షించేందుకు సురక్షితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది ఎంతో రక్షణాత్మక వ్యవస్థ అని రుజువు అవుతూ వస్తోంది కూడా. పాకిస్తాన్ అణ్వాయుధ కమాండ్ సంస్థ (ఎన్సీఏ) నేతృత్వంలో వాటి పర్యవేక్షణ సాగుతోంది. అంతేకాదు, న్యూక్లియర్ వ్యర్థాలను కూడా ఎలా నిర్వహించాలో మాకు తెలుసు..'' అని ఆయన చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదంతో మేమూ పోరాడుతున్నాం...
పాకిస్తాన్ ఓ బాధ్యతాయుతమైన దేశమని ఆ దేశ ప్రధాని అబ్బాసీ వ్యాఖ్యానించారు. తమ దేశంలో ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పరుచుకున్నారనేవి కేవలం వదంతులు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. తామది కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని చెప్పుకొచ్చారు. 15 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ఉగ్రవాదంతో పాకిస్తాన్ కూడా పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఏ ఉగ్రవాద సంస్థ చేతుల్లోకో.. మరో వ్యవస్థ చేతుల్లోకో పాక్ అణ్వాయుధ వ్యవస్థ వెళ్లిందనే విషయంలో సందేహం అక్కర్లేదన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయం, నియంత్రణ అంతా ఎన్సీఏ చేతుల్లోనే ఉంటుందన్నారు. ‘మాకు అణుసామర్థ్యం ఉంది. అందులో సందేహం అక్కర్లేదు. అణువ్యర్థాలను ఏం చేయాలో కూడా మాకు తెలుసు. 60వ దశకంలోనే మేం అణుకార్యక్రమాలను చేపట్టాం. 50 ఏళ్లుగా అణుశక్తి నిర్వహణ చేస్తున్నాం.. ఇకపైనా కొనసాగిస్తాం..' అని అబ్బాసీ వెల్లడించారు.
అణ్వస్త్ర ప్రయోగం అంత ఈజీనా?
ఒక దేశంపై అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న నిర్ణయాన్ని మరో దేశం తీసుకోవడం అంత ఆషామాషీ కాదు. కొన్ని లక్షల మందిని దారుణంగా చంపడానికి తగిన కారణాలు ఉన్నాయని ఆ దేశం ప్రపంచానికి చాటాల్సి ఉంటుంది. ప్రపంచం కూడా ఆ దేశం వాదనను విశ్వసించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇపుడు.. ఎక్కడ.. ఏ దేశంపై అణ్వస్త్ర ప్రయోగం జరిగినా దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. అందువల్ల భారతపై అణ్వస్త్ర ప్రయోగం అనేది పాక్ ఒక్కటే తీసుకోగల నిర్ణయం కాదు. ఆ నిర్ణయం సబబేనని ప్రపంచానికి పాక్ నిరూపించాల్సి ఉంటుంది.