ఇస్లాంకు వ్యతిరేకం: పెషావర్ ఉగ్రవాదుల దాడిపై ఆఫ్ఘన్ తాలిబన్లు
పెషావర్: పెషావర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉగ్రవాదుల దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఇస్లామిక్ మిలిటెంట్ సంస్ధలు, ఆఫ్ఘనిస్ధాన్ తాలిబన్లు ఖండిస్తున్నారు. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో మొత్తం 141 మంది చనిపోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు.
ఈ దాడిపై ఆఫ్ఘనిస్ధాన్ తాలిబన్లు ఇస్లాంకు వ్యతిరేకమైన చర్యగా అభివర్ణించారు. అమాయక ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు ప్రాణాలు తీయడం ఇస్లాం విధానాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇస్లాం ఆర్గనైషన్స్, ఇస్లాం ప్రభుత్వాలకు ఇది వర్తిస్తుందని అన్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం జమ్మత్ - ఉద్ - దావా అధినేత హఫీజ్ సయీద్ పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉగ్రవాదులు చేసిన నరమేధం ఇస్లాంకు వ్యతిరేకంగా పని చేసే వారి పనిగా అభివర్ణించారు. 26/11 ముంబై ఉగ్రవాదుల దాడులను కూడా హఫీజ్ సయీద్ ఖండించినట్లు తన వార్త కథనంలో పేర్కొంది. ఈ ఘటనలో 160 మంది చనిపోయారు. అనాగరికులు జిహాదీ పేరు మీద టెర్రరిజం చేస్తున్నారని పేర్కొంది.
ఇది ఇలా ఉంటే పెషావర్ ఉగ్రవాది దాడికి ప్రతీకారంగా పాకిస్ధాన్ మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో 11 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు బుధవారం షెర్జాద్ జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
వాహనంలో వెళ్తున్న ఉగ్రవాదులపై జరిగిన డ్రోన్ దాడిలో నలుగురు పాకిస్ధాన్ తాలిబన్లు సహా వాహనంలోని మొత్తం 11 మంది మృతి చెందినట్లు తెలిపారు. మంగళవారం ఆప్ఘనిస్దాన్ సరిహద్దు సమీపంలో పాకిస్ధాన్లోని పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్పై ఉగ్రవాదులు చేసిన దాడిలో 141 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పాకిస్ధాన్ తాలిబన్లు స్కూలు విద్యార్ధులపై సాగించిన నరమేదాన్ని తాము ఖండిస్తున్నట్లు ఆఫ్గనిస్ధాన్ తాలిబన్లు ప్రకటించారు.
పాకిస్ధాన్లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక చర్యకు ప్రతీకారంగానే ఈ దాడి చేశామని తెహ్రీక్-ఇ-తాలిబన్ నేత ఒకరు తెలిపారు. తాము పెద్ద పిల్లలను లక్ష్యంగా చేయమని చెప్పామని చిన్నపిల్లలను కాదని అన్నారు. పెషావర్ నగరంలోని ఆర్మీ స్కూల్లో చిన్న పిల్లలను వదిలివేయాలని అక్కడి సాయుధులైన తాలిబాన్లకు చెప్పినట్లుఒకరు ప్రకటించారు.
పాకిస్ధాన్ సైనికులు తమ కుటుంబాలను లక్ష్యాలుగా చేసుకుని వేధిస్తున్నారని, అన్యాయంగా ఎంతో మందిని బలి తీసుకున్నారని తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ ప్రకటించింది. తమ ఆప్తులను కోల్పోతే, ఆ బాధ ఎలా ఉంటుందో సైనికులకు తెలియాలనే వారి బిడ్డలు చదువుతున్న పాఠశాలపై దాడి చేశామని తాలిబాన్లు స్పష్టం చేశారు.