త్వరలో పుతిన్- బైడెన్ భేటీ.. ఉక్రెయిన్ సంక్షోభ నివారణే అజెండా
తూర్పు యుక్రెయిన్ లో కాల్పుల మోత మోగుతుండగా.. మరోవైపు శాంతి చర్చల దిశగా అడుగులు పడుతున్నాయి. రష్యా.. యుక్రెయిన్ను దెబ్బ తీసి కానీ ఊరుకోదని అమెరికా అధినేత బైడెన్ ప్రకటించిన తర్వాత.. యుక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు, ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా అధినేత పుతిన్తో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ భేటీ కానున్నాడని అమెరికా వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి.
పొరుగు దేశంపై రష్యా దండయాత్రను ఆపేందుకు.. జో బైడెన్ నేరుగా రంగంలోకి దిగబోతున్నాడని అమెరికాకు చెందిన ఉన్నత అధికారి ఒకరు అఫీషియల్ గా ప్రకటించారు. రష్యా- యుక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి పరిణామాలను సీరియస్గా అమెరికా పరిగణిస్తోందని స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.
తూర్పు యుక్రెయిన్ సరిహద్దులో ఫైరింగ్, యుద్ధ ట్యాంకుల మోహరింపు, యుద్ధ విమానాల గస్తీ ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నామని బ్లింకెన్ అన్నారు. పుతిన్ తన యాక్షన్ ప్లాన్ మరింత ముందుకు తీసుకెళ్లకుండా దౌత్య మార్గాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ సమయంలోనైనా 'పుతిన్ తో జో బైడెన్ భేటీ' జరిగే చాన్సుందన్నారు. ఈ భేటీ నేరుగా గానీ.. వర్చువల్ గా గానీ.. ఏ ఫార్మాట్ లోనైనా జరగొచ్చన్నారు. యుద్ధం ఆపడమే అమెరికా ముందున్న కర్తవ్యమని బ్లింకెన్ వివరించారు.
ఈస్టర్న్ యుక్రెయిన్లో కాల్పుల విరమణ కోసం కలిసి పనిచేయాలని రష్యా, ఫ్రాన్స్ నిర్ణయం తీసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ విషయంలో ఫోన్ సంభాషణ జరిపినట్టు ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల విదేశాంగ మంత్రులు కూడా భేటీ కానున్నట్టు సమాచారం ఉంది.