రాజకీయాల్లో అంతే : అప్పుడు విడిపోయిన దంపతులు.. ఇప్పుడు కలిపిన ఎంపీటీసీ ఎన్నికలు
చొప్పదండి : కుటుంబ కలహాలు ఆ దంపతులను దూరం చేశాయి. జీవితంలో ఎట్టిపరిస్థితుల్లో కలిసేది లేదంటూ ఎవరికివారుగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. దాంతో అతనొక్క దగ్గర.. ఆమె మరో దగ్గర.. అలా జీవితాలు నెట్టుకొస్తున్నారు. అయితే అనూహ్యంగా వారిద్దరూ మళ్లీ ఏకమయ్యారు. ఔను.. వాళ్లిద్దరూ భార్యభర్తలుగా కలిసిమెలిసి జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యారు.
వింత దూడ.. మనిషి స్వభావం.. పాటలకు స్టెప్పులు కూడా..!
కుటుంబ కలహాలు.. మళ్లీ కలిపిన ఎన్నికలు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ లీడర్ లక్ష్మణ్.. కుటుంబ కలహాల కారణంగా ఐదేళ్ల నుంచి భార్య కవితకు దూరంగా ఉంటున్నారు. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయితే విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే పరిషత్ ఎన్నికల పుణ్యమా అని వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.
రిజర్వేషన్ల లెక్కలతో రామడుగు మండలంలోని మోతె ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు ఖరారైంది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశావహులు పెద్దసంఖ్యలో టికెట్ ఆశిస్తున్నారు. ఆ క్రమంలో లక్ష్మణ్ కూడా టికెట్ తనకే కావాలంటూ పట్టుబట్టారు.
టికెట్ ఫిటింగ్.. ఒక్కటైన భార్యభర్తలు
లక్ష్మణ్ భార్య ఆయనకు దూరంగా ఉండటంతో మోతె ఎంపీటీసీ టికెట్ డైలమాలో పడింది. ఎట్టిపరిస్థితుల్లో టికెట్ తనకే కేటాయించాలని పట్టుబట్టిన లక్ష్మణ్.. తన తల్లిని బరిలోకి దించాలని భావించారు. అయితే వయసులో పెద్దవారనో లేదంటే ఇతర కారణాలో తెలియదు గానీ.. ఆయన తల్లికి టికెట్ ఇవ్వడానికి టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకోలేదట. కుటుంబ గొడవలతో తన భార్య వేరుగా ఉంటుందని చెప్పినా కూడా వారు వినిపించుకోలేదట. చివరగా మీ భార్యను తీసుకొస్తే టికెట్ మీకే అంటూ కన్ఫామ్ చేశారట.
అందివచ్చిన అవకాశం.. బెట్టు దిగిన భార్యాభర్తలు
భార్యను తీసుకొస్తేనే పార్టీ టికెట్ ఇస్తామని చెప్పడంతో.. అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నారు లక్ష్మణ్. వెంటనే ఆయన భార్య తరపు చుట్టాలతో రాయబారం పంపారు. ఎట్టకేలకు ఆమె తన దగ్గరకు తిరిగి వచ్చేలా ప్రయత్నాలు ఫలించాయి. ఆయన భార్య కవిత కూడా ఓకే చెప్పడంతో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.
ఇచ్చిన మాట ప్రకారం పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెటిచ్చారు. గురువారం నాడు రిటర్నింగ్ ఆఫీసర్ కు బీఫామ్ కూడా అందజేశారు. మొత్తానికి ఐదేళ్లుగా దూరమైన భార్యభర్తలు ఎన్నికల వేళ ఒకటి కావడం విశేషం.