మంత్రి జగదీశ్కు ఈసీ షాక్: 48 గంటలు క్యాంపెయిన్ బ్యాన్
ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయనపై చర్యలకు తీసుకునేందుకు కారణమైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని ఆయన కామెంట్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి వివరణ ఇచ్చారు.
మంత్రి వివరణపై ఎన్నికల సంఘం అసంతృప్తి చెందింది. ఎన్నికకు సంబంధించి ఆయనపై ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలకు హాజరు కావొద్దని స్పష్టం చేసింది. మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ సాయంత్రం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున ఈ నెల 25వ తేదీన మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలు అందాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలని, పథకాలు వద్దనుకుంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. ఈ కామెంట్లపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఆ కంప్లైంట్ను పరిగణనలోకి తీసుకున్న ఎన్నిల సంఘం.. మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన్ ఎక్స్ ప్లానేషన్ ఇచ్చారు. కానీ దాంతో ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. అందుకే ప్రచారంపై నిషేధం విధించింది. ఇదీ ఒక విధంగా టీఆర్ఎస్ పార్టీకి షాకే. ఆయన జిల్లా మంత్రి.. ఎన్నిక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.