ఆనాటి నుంచి నేటి వరకు.. అక్కడ జెండా పండగ... మువ్వన్నెల జెండా రెపరెపలు
దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి సరిగ్గా 75 ఏళ్లు. బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగిన రోజు... స్వాతంత్య్ర భారతవని సంబరాలు జరుపుకుంటున్న వేళ.. ఆగస్ట్ 15వ తేదీన ఉదయం ప్రతీ రోజు ఆఫీసు/ స్కూల్/ కార్యాలయాల వద్ద జాతీయ జెండాన ఆవిష్కరించి జెండా వందనం చేస్తారు. ఆ వెంటనే లేదంటే సాయంత్రం జెండాను తీసివేయడం జరుగుతుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం జాతీయ జెండా రెప రెపలాడుతూనే ఉంటుంది. దాదాపు 75 ఏళ్ల నుంచి ఆ జెండా ఎగురుతూనే ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాంపేట మండలం బేగంపేటలో జెండా ఎగురుతూనే ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఆనాడు గ్రామానికి చెందిన బల్జె వీరయ్య, బద్దం నర్సింహారెడ్డి, చిగుళ్ల మల్లయ్యలు తొలిసారిగా జాతీయ జెండాను గ్రామ నడిబొడ్డున ఆవిష్కరించి సంబురాలు జరుపుకోన్నారు. ఇక అప్పటి నుంచి జెండా నిరంతరాయంగా ఎగురుతూనే ఉంది.
ఆ అనవాయితీని గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. నాడు ఎత్తిన జెండా నేటికి దించకుండా ఏడున్నర దశాబ్దాలుగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. ప్రతి ఏడాది ఘనతంత్ర, స్వాతంత్ర, దసరా వేడుకల సమయంలో పాత జెండాను మార్చి కొత్త జెండాను ఆవిష్కరిస్తారు. అలా నేటికి జాతీయ భావాన్ని ఆ గ్రామస్తులు చాటుకుంటున్నారు. మిగతావారిలో కాస్తో కూస్తో దేశభక్తిని నింపుతున్నారు.
అఖండ భారతవని మరికొన్ని గంటల్లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రసంగం చేశారు. కరోనా వైరస్ గురించి కోవింద్ ప్రస్తావించారు. కరోనా ముగియలేదు అని.. దానిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా రూల్స్ పాటించాలని కోరారు. కరోనాకు శ్రీరామ రక్ష వ్యాక్సిన్ అని స్పష్టంచేశారు. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ను దేశం సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ప్రతీ భారతీయుడు టీకా తీసుకోవాలని సూచించారు. ఈ కష్టకాలంలో మనకు అండగా నిలిచిన వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి కోవింద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సిబ్బంది వల్లే చాలా మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్ గురించి కోవింద్ ప్రస్తావించారు. క్రీడాకారులు దేశం గర్వపడేలా ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. జమ్ముకశ్మీర్లో నూతన ఒరవడి ప్రారంభం కానుందని చెప్పారు. కశ్మీర్లో కొత్త మార్పులు వస్తాయని.. ఇందులో యువత కూడా భాగస్వాములు కావాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుందని.. ఇప్పటివరకు అన్నీ రంగాల్లో అభివృద్ది సాధించిందని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. ఎంతోమంది మహానీయులు తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టడంతో మనం స్వేచ్చ వాయువులు పీలుస్తున్నామని ఆయన వివరించారు. స్వాతంత్ర్యం వచ్చేందుకు పోరాడిన మహానీయులకు నమస్కరిస్తున్నానని అని తెలిపారు.