మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం; నిద్రలోనే అనంతలోకాలకు ఆరుగురు!!
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో రాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమైన సంఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులతో సహా ఆరుగురు మంటల్లో కాలిబూడిదయ్యారు ఈ సంఘటనలో మృతి చెందిన వారు 50 సంవత్సరాల శివయ్య , 45 సంవత్సరాల పద్మ, 23 ఏళ్ల మౌనిక, శాంతయ్య, చిన్నారి హిమబిందు, స్వీటీ లు గా పోలీసులు గుర్తించారు.
ఒక్కసారిగా ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల స్థానికులు చూశారు. వారిని కాపాడటానికి కూడా వెళ్ళలేని విధంగా పెద్ద ఎత్తున మంటలు రావటంతో అది గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక ఈ లోపే జరగరాని ప్రాణ నష్టం జరిగిపోయింది.
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలను గుర్తించాల్సి ఉంది. మొత్తంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అక్కడివారిని ఆవేదనకు గురి చేస్తోంది. ఇక ప్రమాద ఘటనపై డి సి పి అఖిల్ మహాజన్ అధికారులతో మాట్లాడి, త్వరితగతిన ప్రమాదానికి గల కారణాలను గుర్తించాలని సూచించారు.