మేం పన్నులు ఎందుకు కట్టాలి, ఆ లెక్క చెప్పు: మోడీకి హైదరాబాదీ షాకింగ్ లేఖ!
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాత కరెన్సీ రద్దు ద్వారా కేంద్రం నల్లధనం ఉన్న వారికి గట్టి షాక్ ఇచ్చింది. అయితే, ప్రజలు దీంతో చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ప్రశ్నిస్తూ హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మోడీకి లేఖ రాశారు.
ప్రసాద్ అనే వ్యక్తి బాలానగర్లో చిన్న పరిశ్రమ నడిపిస్తారు. నెలకు రూ.2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. ఏడాదికి రూ.24 లక్షలు సంపాదిస్తారు. తాను ఏడాదికి లెక్క ప్రకారం రూ.3 లక్షల పన్ను కట్టాలని, కానీ నేను జస్ట్ రూ.30 వేలు మాత్రమే కడతానని చెప్పారు. అందుకు కారణాలను కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు.
నేను మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని, కష్టపడి చదువుకొని తొలుత ఉద్యోగం చేసి, ఆ తర్వాత సొంతగా పరిశ్రమ పెట్టానని, తన సంపాదనలో రూ.1 లక్ష తన కుటుంబ అవసరాలకే పోతుందని, మిగతా లక్ష భములు, బంగారం లాంటి వాటిలో పెట్టుబపడులు పెట్టానని చెప్పారు.
అప్పుడే ఈ ఉపాయం వచ్చింది, అసలు ఆ డబ్బెక్కడ?: కరెన్సీ రద్దుపై మోడీ
రూ.ఒక లక్షలో తాను పరోక్ష పన్నుల రూపంలో రూ.30వేల వరకు కడుతున్నానని, కిరాణా సరుకుల నుంచి టీవీ మొబైల్ దాకా ఏది కొన్నా రూ.20 నుంచి రూ.30 శాతం పన్ను ఉందన్నారు. స్నేహితులతో పార్టీ చేసుకుంటే రూ.3000 ఖర్చు అవుతుందని, దానికి దాదాపు అరవై శాతం పన్ను కడుతున్నానని చెప్పారు.
కారు కోసం ట్యాక్స్, ఇంటి రిజిస్ట్రేషన్ కోసం ఇలా పలు ట్యాక్సులు కట్టానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తే బపాగా చదువు వస్తుందనే నమ్మకం ఉందా, ప్రభుత్వాసుపత్రికి వెళ్తే ఆరోగ్యంతో తిరిగి వస్తామనే నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. దేశ రక్షణ, రోడ్లు వేయడం తప్ప చేస్తున్న అభివృద్ధి ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బు ఏమవుతోందని ప్రశ్నించారు. మా పరిశ్రమలో పని చేసే వారికి ఇంక్రిమెంట్లు, ఆ మేరకు జీతాలు ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అలా కాదన్నారు. పైగా ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయానికి ఆలస్యంగా వస్తారన్నారు. మరి మేం పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. లంచాలు కూడా ఇవ్వవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ లంచాలను తెల్లధనంగా ఎలా చూపించగలమని ప్రశ్నించారు. అందుకే పన్ను కట్టాలంటే మాకు మండిపోతుందన్నారు. అలాగని నేను సామాజిక బాధ్యత లేనివాడిని కాదని, సైనిక నిధికి విరాళంగా రూ.10వేలు ఇచ్చానని, తమ దగ్గరలోని అనాధాశ్రమానికి ఏడాదికి రూ.20వేలు ఇస్తానని చెప్పారు. మా ఊరి స్కూల్ బాగు కోసం రూ.లక్ష ఇచ్చానన్నారు. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మనసొప్పదన్నారు.
ఆ తర్వాత ఆయన ఇంకా కొనసాగించారు... ఇప్పుడు గతం వదిలేద్దామని, మీరు(మోడీ) చెప్పారు కాబట్టి తన వద్ద ఉన్న రూ.10 లక్షల డబప్బుకు 30 శాతం అంటే రూ.3 లక్షలు కట్టి తెల్లగా మార్చుకుంటానని, కానీ రేపటి నుంచి నేను నెలకు రూ.10వేలు లంచాలు ఇవ్వకుండా పనులు అవుతాయని గ్యారెంటీ ఇస్తారా అని ప్రశ్నించారు. గల్లీ లీడర్ నుంచి అందరికి విరాళాలు ఇవ్వవలసి వస్తుందన్నారు.
అన్ని పార్టీలు విరాళాలను కూడా చెక్కు రూపంలో తీసుకునేలా చట్టం తీసుకు వస్తారా, డబ్బుల లెక్కలను రహస్యం లేకుండా ఓపెన్గా చెబుతారా అని ప్రశ్నించారు. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతం కోసం అయితే మేం పన్నులు కట్టం సర్ అని పేర్కొన్నారు. పదేళ్లకి మళ్లీ బ్లాక్ మనీ పెరిగిపేతో మళ్లీ నోట్ల మార్పిడి తెస్తారా అని ప్రశ్నించారు.
మీ నిర్ణయం వల్ల రెండు రోజులుగా చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న మా వర్కర్స్ కూడా.. మీ మీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ఇక నుంచి మేం కట్టే పన్నులకు న్యాయం చేయాలని, మేం కూడా న్యాయంగా పన్నులు కడతామన్నారు. కాగా, ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.