ఫిబ్రవరి 1 నుండి బీజేపీ బడా ప్లాన్; టార్గెట్ ఫిక్స్ చేసిన హైకమాండ్!!
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది . పార్టీలో పని చేస్తున్న కీలక నాయకులకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం టాస్క్ లను అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నయం బిజెపి నే అని చెప్పే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా ముందుకు వెళుతున్నారు.

తెలంగాణా బీజేపీ నేతలకు కీలక టాస్క్ ఇచ్చిన అధిష్టానం
ప్రజల్లో వస్తున్న మద్దతు ఓటు బ్యాంకు లా మారేలాగా బిజెపి అగ్ర నాయకులు తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు. ఈ మేరకు ఒక పకడ్బందీ వ్యూహాన్ని రచించి దానిని ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్ర, ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలతో దూకుడు మీదున్న బీజేపీ నేతలకు అధిష్టానం మరో కీలక బాధ్యతను అప్పగించింది.

క్షేత్ర స్థాయిలో బీజేపీ బలోపేతం కోసం అధిష్టానం నిర్ణయం
తెలంగాణ బిజెపిలో కీలక నాయకులు అందరూ ఎవరికివారు తమ ఇమేజ్ ను పెంచుకునేలాగా వివిధ కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. అయితే ఎవరికి వారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బిజెపి అధినాయకత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేకమార్లు సర్వేలు నిర్వహించిన బిజెపి అధిష్టానం ఈ మేరకు పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసింది.

11 వేల సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలపడలేదని గుర్తించిన బిజెపి అధిష్టానం గ్రామ, గ్రామానికి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టడం కోసం పార్టీలోని నాయకులందరూ పనిచేయాలని సూచించింది. స్ట్రీట్ కార్నర్ మీటింగులు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని బిజెపి అధినాయకత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించింది. అంతేకాదు 119 నియోజకవర్గాల తెలంగాణలో తొమ్మిది వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుందని పేర్కొంది.

గ్రామాలలో శక్తి కేంద్రాల ఏర్పాటు.. ఫిబ్రవరి ఒకటి నుండి రంగంలోకి
ప్రతి గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో బిజెపి పని చేసేలాగా శక్తి కేంద్రాల ఏర్పాటు చేయాలని, ఇక బూత్ స్థాయిలో ఎన్నికల నిర్వహణ కోసం కమిటీలు వేయాలని బిజెపి అధినాయకత్వం నిర్ణయించింది. ప్రతి శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్ ను నియమించి మరీ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిత్యం ప్రజలకు కనిపించేలా వివిధ కార్యక్రమాలతో బిజెపి దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. అంతేకాదు ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక ఇదే సమయంలో నేతల కొరతను అధిగమించడం కోసం కూడా బిజెపి రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల్లో ఉన్న బలమైన కీలక నేతలను పార్టీ మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది.












Click it and Unblock the Notifications