భారీగా పెరిగిన బీఆర్ఎస్ ఆదాయం: ఏకంగా 218 కోట్లు, మొత్తం రూ. 480 కోట్లకు చేరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఇటీవలే భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు పార్టీ పేరును మార్చారు. ఇప్పటికే దేశ రాజధానిలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ప్రారంభించారు. అంతేగాక, పార్టీకి ఓ సొంత విమానం కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఏడాదిలోనే 218 కోట్లు పెరిగిన బీఆర్ఎస్ ఆదాయం
అయితే, ఒక్క ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ ఆదాయం భారీగా పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఆదాయం 2021-2022 మధ్యకాలంలో రూ. 37.65 కోట్ల నుంచి రూ. 218.11 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ. 40 కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్టీ ఈ నివేదికలో పేర్కొంది.
బీఆర్ఎస్కు గతేడాది ఆదాయం లేదు కానీ..
కాగా, ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేదు. అయితే, ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఏడాదిలో రూ. 288 కోట్ల నుంచి రూ. 480 కోట్లకు చేరింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాల పరిమితిలో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ. 451 కోట్లు జమ చేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ. 256 కోట్ల మేర ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఆదాయం వివరాలు
తాజా నివేదిక ప్రకారం.. 2021 మార్చి 31 నాటికి పోస్టాఫీసుల్లో డిపాజిట్ల రూపంలో రూ.253 కోట్లు ఉండగా.. 31 మార్చి 2022 నాటికి రూ.451కు పెరిగింది. 31 మార్చి 2021 నాటికి రుసుములు, చందాల ద్వారా రూ.17 కోట్లు రాగా.. 31 మార్చి 2022 నాటికి వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.8,04,74,020గా ఉంది. వ్యక్తిగత చందాల ద్వారా వచ్చిన ఆదాయం మార్చి 2021 నాటికి రూ.1,00,02,379 కాగా, గత ఏడాది మార్చి నాటికి రూ.90,00,000గా ఉంది. సాధారణ చందాల ద్వారా 2021 మార్చి నాటికి రూ.3 కోట్లు రాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.75 కోట్లు వచ్చాయి. గత ఏడాది మార్చి నాటికి ఇతర ఆదాయం ద్వారా రూ.16.21 కోట్లు రాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.16.12 కోట్లు వచ్చాయి. ఇక, నికర ఆదాయం, ఓపెనింగ్ బ్యాలెన్స్, జనరల్ ఫండ్ మొత్తం కలిపి బీఆర్ఎస్ పార్టీ తాజా ఆస్తుల విలువ రూ.480 కోట్లకు చేరింది. బీఆర్ఎస్ ఆదాయం భారీగా పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.