చంద్రబాబు, జానా రెడ్డి పార్టీలు మారలేదా: కెటిఆర్, షబ్బీర్కు బెదిరింపు కాల్పైనా..
హైదరాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ప్రతిపక్ష నేత జానా రెడ్డి పార్టీలు మారలేదా అని తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు కెటి రామారావు ప్రశ్నించారు. పార్టీలు మారినవాళ్లే ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
టిడిపి నేత, మాజీ మంత్రి విజయ రామరావును కలిసిన తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారెవరు పార్టీ మారలేదని ఆయన అడిగారు. వారు మడి గట్టుకుని ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
జానారెడ్డి, చంద్రబాబు పార్టీలు మారొచ్చు కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీలు మారితే తప్పా? అని నిలదీశారు. పార్టీలు మారడం ఎవరి ఇష్టం వారిదన్నారు. ఒక్క టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నట్టు, టీఆర్ఎస్ పార్టీ చేయగూడని తప్పేదో చేస్తున్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ప్రజలకు జ్ఞాపక శక్తి లేదనుకోవడం సరికాదన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో చేరారో వారికి తెలుసున్నారు.
కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీని బెదిరించే స్థాయి తమకు లేదని, బెదిరింపుల అలవాటు తమకు లేదని ఆయన అన్నారు. షబ్బీర్ అలీకి వచ్చిన బెదిరింపు కాల్పై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని తాము కూడా కోరుతున్నామని ఆయన అన్నారు. తమ పార్టీలోకి ఆహ్వానించడానికే తాను విజయ రామారావును కలిసినట్లు ఆయన తెలిపారు.
తమ పార్టీ కార్యకర్తలు, తాము అలాంటి బెదిరింపులకు పాల్పడే ప్రసక్తేలేదన్నారు. నిందితులెవరైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. తమకు ఇంకా మూడున్నరేళ్లు అధికారంలో కొనసాగే సమయం ఉందని వివరించారు.
విజయరామారావు లాంటి అనుభవం కలిగిన వారి సేవలు రాష్ర్టానికి అవసరమన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లుందుకు విజయరామారావు లాంటి పెద్దల సేవలు అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో విద్యావంతులు కలిసి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
విజయరామారావు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజాస్వామ్యం బలోపేతానికి తోడ్పడుతుందని వెల్లడించారు. విజయరామారావు పరిపాలనపై మంచి అవగాహన కలిగిన వారని తెలిపారు. ఆయన సలహాలు, అనుభవాలు ప్రభుత్వానికి అవసరమన్నారు.
టిఆర్ఎస్లో చేరే విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని విజయ రామారావు చెప్పారు. టిఆర్ఎస్లోకి ఆహ్వానించడానికే తనను కెటిఆర్ కలిసినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. నిన్ననే టిడిపి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తే చేశారు.