హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక అడుగు, సీఎంఆర్ఎస్ అనుమతి
భాగ్యనగరం మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఎస్సార్ నగర్ - మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకు సోమవారం సీఎంఆర్ఎస్ అనుమతి వచ్చింది. మూడు రోజుల పాటు అధికారులు ఈ మార్గాన్ని తనిఖీ చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరం మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఎస్సార్ నగర్ - మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకు సోమవారం సీఎంఆర్ఎస్ అనుమతి వచ్చింది. మూడు రోజుల పాటు అధికారులు ఈ మార్గాన్ని తనిఖీ చేశారు. మియాపూర్ - నాగోల్, నాగోల్ - మెట్టుగూడ వరకు అనుమతి లభించింది.
మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ..
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 28వ తేదీన మెట్రో రైలు ప్రారంభం కావాలంటే సీఎంఆర్ఎస్ (కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ) క్లియరెన్స్ సోమవారం వరకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించింది. కానీ అనుమతి లభించింది.
ప్రభుత్వానికి ఊరట
నవంబర్ 28వ తేదీకి మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. సోమవారం వరకు అనుమతులు రాకపోవడంతో పూర్తిగా అనిశ్చితి కనిపించింది. దీంతో గవర్నర్, కేంద్రమంత్రులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వాన పత్రాలను కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు అనుమతులు లభించడంతో ప్రభుత్వానికి ఊరట లభించినట్లే.
సీఎంఆర్ఎస్ ఓకే చేస్తేనే తిరగాలి
మెట్రో రైల్ భద్రతా కమిషనర్ (సీఎంఆర్ఎస్) ఓకే చేస్తేనే మెట్రో రైలు తిరగాలి. ఈ సర్టిఫికెట్ రావాలంటే సంబంధిత అధికారులు రక్షణ, సాంకేతిక ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉన్నాయో లేదో పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంటుంది. బెంగళూరు మెట్రో పనులు పూర్తయిన తర్వాత, సంబంధిత నిర్మాణ సంస్థ దరఖాస్తు చేసిన ఆరు నెలలకు సీఎంఆర్ఎస్ నుంచి అనుమతి వచ్చింది.
హైదరాబాదులో ఇలా
హైదరాబాద్లో నాగోలు-మెట్టుగూడ లైన్కు, మియాపూర్ - ఎస్సార్నగర్ మార్గానికీ అనుమతి రావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. ఇప్పుడు ఎస్సార్నగర్-మెట్టుగూడ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మెట్టుగూడ నుంచి అమీర్ పేట 9 కిలోమీటర్లు, అమీర్ పేట నుంచి ఎస్సార్ నగర్ ఒక కిలోమీటర్. ఈ మార్గానికి అనుమతిపై సోమవారం వరకు అనిశ్చితి కనిపించింది. కానీ సాయంత్రానికి ఊరట లభించింది.
కొద్దిరోజుల క్రితమే దరఖాస్తు
కొద్దిరోజుల కిందటే భద్రతా ధ్రువపత్రం కోసం ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు దరఖాస్తు చేశారు. ఈ మార్గంలో తనిఖీలు నిర్వహించి, భద్రతా అనుమతి ఇచ్చే అధికారాన్ని దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్కు అప్పగించారు. ఈ విభాగం రెండు మూడు రోజులు తనిఖీలు చేసి, ఇప్పుడు ధ్రువపత్రం ఇచ్చారు.