తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా గులాం నబీ ఆజాద్! త్వరలో అధికారిక ప్రకటన
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్లుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు యాత్ర చేస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏపీ వ్యవహారాల్లో ఆజాద్ క్రియాశీలకంగా వ్యవహరించారు.
జమ్ము కాశ్మీర్లోని దోడా జిల్లాలో గులాం నబీ ఆజాద్ జన్మించారు. ఆయన జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పని చేశారు.
కాగా, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ అధిష్టానం దృష్టి సారించింది ఈ క్రమంలో నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఊమన్ చాందీని ఏపీ ఇంచార్జిగా నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈయన కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.