పార్లమెంట్ అభ్యర్థుల అంశంలో టీఆర్ఎస్ వ్యూహాన్ని అమలు చేయబోతున్న కాంగ్రెస్..!!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సైలెంట్ ఐపోయాయి. ఓటమికి గల కారణాలను విష్లేశించుకుంటూనే భవిష్యత్ రాజకీయాల పట్ల వ్యూహాలను రచిస్తున్నాయి కొన్ని పార్టీలు. అందులో కాంగ్రెస్ పార్టీ రానున్న పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ ను సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. పైకి ముభావంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్తుల ఎంపికలో జరిగిన జాప్యాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో పునరావ్రుతం చేయకూడదని క్రుతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ పొరపాటు మళ్లీ పునరావ్రుత్తం కావొద్దు..! అందకే పార్లమెంట్ అభ్యర్తుల ముందుస్తు ప్రకటన..!!
అసెంబ్లీ ఫలితాలతో ఢీలా పడిన టీ కాంగ్రెస్ నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ముందస్తు ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ ఫార్ములానే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. దీంతో ఆయా నేతలకు ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం దొరికింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో రెండు మూడు సార్లు ప్రచారం చేసుకునే అవకాశం దక్కడంతో ఆ పార్టీకి విజయావకాశాలు మెరుగుపడ్డాయి.
లోక్ సభ ఎన్నిల్లో ప్రభావం చూపిస్తాం..!! అభ్యర్థులే మా బలం అంటున్న కాంగ్రెస్..!!
ఇప్పుడిదే ఫార్ములాను కాంగ్రెస్ అనుసరిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిలకు పార్లమెంట్ టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, లోక్సభ విషయానికి వచ్చేసరికి సమీకరణలు మారుతాయని, ఈసారి లోక్సభకు వేరుగా ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు కొంత తక్కువగానే ప్రభావం చూపుతాయనే అంచనాలో కాంగ్రెస్ సీనియర్లున్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుంది..! ప్రతికూలతలు అదిగమిస్తాం..!!
దీనికి తోడు జాతీయ పార్టీగా కాంగ్రెస్కు ఉండే సానుకూలత, మోదీ పట్ల వ్యతిరేకత ఉన్న ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారనే ఆశావహ దృక్పథంతో లోక్సభ బరిలో దిగేందుకు వీరంతా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం కొందరు నేతలను ఫైనల్ చేసిందని సమాచారం. ఖమ్మం నియోజకవర్గం నుంచి రేణుకా చౌదరి/పొంగులేటి సుధాకర్రెడ్డి, వరంగల్ నుంచి నరేశ్ జాదవ్/సోయం బాపూరావు/రాష్ట్ర స్థాయి అధికారి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ రమేశ్రాథోడ్, భువనగిరి నుంచి పొన్నాల/గూడూరు నారాయణరెడ్డి, మహబూబ్నగర్ నుంచి రేవంత్/జైపాల్రెడ్డి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హేమాహేమీలు రంగంలోకి..! గెలుపుదిశగా కాంగ్రెస్ వ్యూహాలు..!!
అలాగే మల్కాజ్గిరి నుంచి డీకే అరుణ/ఆమె కుమార్తె స్నిగ్ధారెడ్డి, కరీంనగర్ నుంచి మాజీ మంత్రి జీవన్రెడ్డి, నాగర్కర్నూలు నుంచి నంది ఎల్లయ్య/మల్లు రవి, నిజామాబాద్ నుంచి మధుయాష్కీగౌడ్, మెదక్ నుంచి సినీనటి విజయశాంతి, చేవెళ్ల నుంచి ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, సికింద్రాబాద్ నుంచి అంజన్కుమార్యాదవ్/అజారుద్దీన్, హైదరాబాద్ నుంచి ప్రముఖ ఎడిటర్ జాహెద్అలీఖాన్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా ఇదే జాబితా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లి పునరావ్రుత్తం చేయొద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ.