డేటా చోరీ కేసు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: ప్రతి సర్వేలోను 'కీ పర్సన్'.. ఎవరతను?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారానికి కారణమైన డేటా చోరీ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాఫ్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక దర్యాఫ్తు (సిట్) బృందం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నర్కు ఫిర్యాదు చేసిన అనంతరం జగన్ ఏం చెప్పారంటే?
సిట్ ఏర్పాటు
ఐటీ గ్రిడ్ వ్యవహారంపై సిట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రెండు కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్) పరిధిలో నమోదైన కేసులపై సిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఈ వ్యవహారాన్ని దర్యాఫ్తు చేయనుంది. ప్రత్యేక దర్యాఫ్తు బృందంలో ముగ్గురు ఐపీఎస్లు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు ఉంటారు.
స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో వీరే
స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఐటీ గ్రిడ్పై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాఫ్తు మొత్తం సిట్కు బదలీ చేయనుంది. డీజీపీ కార్యాలయంలోనే సిట్కు సంబంధించిన ప్రత్యేక చాంబర్ను కేటాయించనున్నారు.
డేటా చోరీ అయిందన్న వ్యవహారంపై హైదరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో మాదాపూర్, ఎస్సార్ నగర్లో రెండు కేసులు నమోదయ్యాయి. వీటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీకి పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం క్లిష్టంగా మారిన నేపథ్యంలో రెండు కేసులను ఒకేసారి దర్యాప్తు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సిట్ ఏర్పాటును కోరుతూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ నేరాలపై అవగాహన కల్గిన అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు కేసుల దర్యాప్తును వెంటనే ప్రారంభించాని ఉత్తర్వుల్లో పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో హైదరాబాద్, సైబరాబాద్తో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్, సీఐడీ పోలీసుల సహకారం సైతం సిట్ తీసుకోనుంది. గురువారం నుంచి ఈ కేసు దర్యాప్తును సిట్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆ కీ పర్సన్ ఎవరో తేలాల్సి ఉంది
ఐటీ గ్రిడ్స్ సంస్థ తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్ చేయిస్తుంది. వారి నుంచి సమాచారం టీడీపీ బూత్స్థాయి అధికారులకు వెళ్తుంది. సర్వేలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫోన్లు వచ్చిన వ్యక్తులను సైతం పోలీసులు ప్రశ్నించారు. వారు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. ఆధార్ నంబర్, విద్య, సామాజిక వర్గం వివరాలను సర్వేయర్లు సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ఆ వివరాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ పరిశీలిస్తుంది. సేవామిత్ర వెబ్సైట్లో బూత్ కన్వీనర్, డ్యాష్బోర్డు వివరాలు ఉన్నాయి. ప్రతి సర్వేలోనూ కీ పర్సన్ అనే పదం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ కీ పర్సన్ ఎవరనే దానిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదో కోడ్లా ఉందన్నారు. ఓటు గల్లంతైన వారి వివరాలు ఆన్లైన్ పరిశీలనలో దొరకడంలేదన్నారు. సిట్ విచారణలోను ఇది తేలనుంది.