కలకలం: కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం!
ఐదుసార్లు బోర్లు వేసినా.. నీళ్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని నెట్టుకురాకలేక తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
సికింద్రాబాద్: పంజాగుట్ట సమీపంలోని తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఆ రైతును పోలీసులు తక్షణం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా గట్టు మండలం, ఆలేర్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు వ్యవసాయంలో తీవ్ర నష్టాలను చవిచూశాడు. ఐదుసార్లు బోర్లు వేసినా.. నీళ్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని నెట్టుకురాకలేక తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న మల్లేష్.. సీఎంను కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వారించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లేష్ ఆత్మహత్యకు యత్నించాడు.
వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో.. గమనించిన పోలీసులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. మల్లేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. మల్లేష్ ఆత్మ
హత్యాయత్నం గురించి ఆలేర్ పోలీసులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications