తెలుగు ప్రొఫెసర్లు క్షేమమే కానీ!: విడుదలపైనే జాప్యం, కేంద్రం సంప్రదింపులు
న్యూఢిల్లీ: లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాగా, ప్రతి రోజూ సిర్టే విశ్వవిద్యాలయం డీన్తో సంప్రదింపులు జరుపుతున్నా.. ప్రొఫెసర్ల విడుదలలో జాప్యం జరుగుతోందని విదేశీ వ్యవహారాలశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం కూడా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్తో ఈ విషయంపై మాట్లాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణల యోగక్షేమాలను తెలుసుకున్నారు.
ఇద్దరు ప్రొఫెసర్లను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రహస్య ప్రదేశంలో ఉంచారని, సోమవారం సాయంత్రం వరకూ వారు క్షేమంగానే ఉన్నారని సిర్టే యూనివర్సిటీ డీన్ వెల్లడించినట్లు విదేశాంగశాఖ అధికారులు తెలిపారు.
అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారినందున వారిని విడుదలచేస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం లేనందువల్లనే విడుదలలో జాప్యం జరుగుతోందని డీన్ వివరించినట్లు తెలిపారు.
ఇద్దరు ప్రొఫెసర్లను విడిచిపెట్టడానికి ఐఎస్ మిలిటెంట్లు హామీ ఇచ్చినప్పటికీ స్థానిక పరిస్థితుల కారణంగానే ఆలస్యం జరుగుతోందని వెల్లడించారు. కాగా, ప్రొఫెసర్ బలరాం భార్య శ్రీదేవీ, గోపీకృష్ణ భార్య కళ్యాణి రెండుమూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ను కలవాలని నిర్ణయించుకున్నారు.