దగ్దమవుతోన్న ఆంధ్రజ్యోతి కార్యాలయం: ఎగసిపడుతోన్న మంటలు..
తొలుత కార్యాలయంలో ఉన్న పరికరాలతోనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
హైదరాబాద్: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
కార్యాలయంలో మంటలు ఎగిసిపడటంతో.. ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మెట్లపై కూడా మంటలు వ్యాపించడంతో.. పక్క భవనాల మీద నుంచి కిందకు వచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల నుంచి ఫైరింజన్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
తొలుత కార్యాలయంలో ఉన్న పరికరాలతోనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్లు అక్కడ మంటలు ఆర్పే పనిలో ఉన్నాయి. లోపల చాలావరకు ఫైళ్లు కాలిపోయినట్లు తెలుస్తోంది.
లోపలికి వెళ్లి మంటలను ఆర్పే పరిస్థితి లేకపోవడంతో.. చుట్టుపక్కల భవనాల నుంచి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. భవనంలోని మూడు, నాలుగు అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే భవనం మాత్రం పూర్తిగా కాలిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.