హరీశ్ రాద్దాంతం: ‘టి’లో ఛార్జీలెలా పెంచుతారని గాలి, ‘బాబు ఏజెండా అమలు’
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ సర్కారు విధానాలపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం సీనియర్ నేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు అమాంతం పెంచేసిందని, ఆదాయంలో మిగులు సాధిస్తున్నప్పటికీ ఛార్జీల భారం ప్రజలపై మోపడమేంటని ఆయన దుయ్యబట్టారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదంపై గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, హరీశ్ రావు భేటీ అయిన అంశంపైనా స్పందించారు. కృష్ణానది జలాలపై మంత్రి హరీశ్రావు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
హరీశ్రావు ఈ అంశంపై వితండవాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన చట్టంలో తెలుగురాష్ట్రాల పెండింగ్ ప్రాజెక్టులపై పలు అంశాలు ఉన్నాయని, వాటిని అనుసరించే నడుచుకోవాలని ఆయన సూచించారు.
ఇక్కడా చంద్రబాబు ఏజెండానే: హరీశ్ రావు
నల్గొండ: తెలంగాణ ప్రగతికి బాటలు వేసే ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి కార్యకర్తల విస్తృస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్టును ఆక్షేపించని ఉత్తమ్కుమార్రెడ్డికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దు అనే అర్హత లేదని హరీశ్రావు అన్నారు.
10లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్న కాంగ్రెస్, టిడిపి నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చంద్రబాబు అజెండా అమలు చేస్తున్న టిడిపి నాయకులు పోలవరం ముంపుపై ఎందుకు దీక్ష చేయలేదని ప్రశ్నించారు.