విద్యార్థుల దీక్ష భగ్నం: రోహిత్ మృతిపై తల్లి రాధిక అనుమానం, మోడీని ప్రశ్నించిన సోదరుడు
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం సాయంత్రం భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్తులను దీక్షా శిబిరం నుంచి విశ్వవిద్యాలయంలోని హెల్త్ సెంటర్కు తరలించారు.
ఏడుగురు విద్యార్తులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా వారిలో విద్యార్థిని వైఖరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని చెప్పారు. నాలుగు రోజుల క్రితం వారు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. వారి దీక్షను భగ్నం చేసిన స్థితిలో తాము దీక్షను సాగిస్తామని మిగతా విద్యార్థులు చెప్పారు.
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రోహిత్ కులాన్ని ఎందుకు వివాదం చేశారో చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వీసి అప్పారావును తొలగించాలని కూడా వారు డిమాండ్ చేశారు. రోహిత్ ఎందుకు చనిపోయాడో చెప్పాలని వారు కోరుతున్నారు. రోహిత్ ఆత్మహత్యపై తల్లి రాధిక అనుమానాలు వ్యక్తం చేశారు. రోహిత్ను చంపేశారనే ఆనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఇంటికి వచ్చి వచ్చి మాట్లాడుతామని యూనివర్శిటీ అధికారులు అంటున్నారని, తాము అంగీకరించబోమని, రోహిత్ ఎక్కడ చనిపోయాడో అక్కడే తమకు సమాధానం కావాలని రోహిత్ అక్క అన్నది. తమ సోదరుడు రోహిత్ కులాన్ని వివాదం చేయడానని రాజా విమర్శించారు. వేరే కులంవాడైతే చంపేయాలా అని ఆయన అడిగారు. రోహిత్ మరణించిన ఐదు రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడాన్ని ఆయన తప్పు పట్టారు. భరత మాత ఓ బిడ్డను కోల్పోయిందని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తన సోదరుడి మరణాన్ని కులంతో ముడి పెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, మూడో బిడ్డ పుట్టిన తర్వాత తాను విడాకులు తీసుకున్నానని, ఇప్పుడు తన కులం గురించి అడుగుతున్నారని రోహిత్ తల్లి రాధిక అన్నారు. తనకు వడ్డెర కులానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, కుటుంబ కలహాలతో విడాకులు తీసుకున్నామని ఆమె చెప్పారు. తాను మాల సామాజిక వర్గంలో జన్మించినట్లు తెలిపారు. తన కులం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆమె అన్నారు.