ఎన్నాళ్లకెన్నాళ్లకు: ఉరకలెత్తిన మూసీ, సందడే సందడి (ఫోటోలు)
భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుతున్నాయి. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షాలతో మూసీ నది పొంగిపొర్లుతోంది.
హైదరాబాద్: భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుతున్నాయి. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షాలతో మూసీ నది పొంగిపొర్లుతోంది.
నిండిన హుస్సేన్ సాగర్: సెలవు కావడంతో.., భారీ వర్షం ఎందుకిలా?
పలు ప్రాంతాల్లో మూసీ రహదారులు నీట మునిగాయి
సోమవారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భాగ్యనగరంలోని వరద నీరంతా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆ నీరంతా రంగారెడ్డి జిల్లా మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి వస్తుంది. దీంతో మూసీ నదిపై ఉన్న పలు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీటి ఉధృతితో మునిగిపోయాయి.
మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు
సమీప గ్రామాలకు రాకపోకలన్నీ బంద్ అయ్యాయి . మూసీ ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేసి కిందకు నీరు వదులుతున్నారు. మంగళవారం ఇన్ ఫ్లో 3500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.80 అడుగులుగా ఉంది.
స్తంభించిన రవాణా వ్యవస్థ
పోచంపల్లి, బీబీనగర్, రుద్రవెల్లి, వలిగొండ, అమ్మనబోలు ప్రాంతాల్లో కల్వర్టులపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తారు.
వారం రోజుల వర్షాలకు తోడు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీలో నీటి ప్రవాహం పెరిగింది. సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కురుస్తున్న వర్షంతో వరద పోటెత్తింది.
భీమలింగం ఆలయంలో కదిలిన శివలింగం
వలిగొండ మండలం గోకారం-భువనగిరి మండలం బొల్లెపల్లి రహదారి వంతనపై నుంచి మూసీ ప్రవహించింది. వరద తాకిడికి భీమలింగం ఆలయంలోని శివలింగం ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి కదిలింది. సాయంత్రానికి నీటి ఉరవడి తగ్గడంతో అడుగు ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.
మూసీ నది ఇలా పారుతోంది
వికారాబాద్ జిల్లా అనంతగిరి పుట్టిన మూసీ నగరం మీదుగా వాడపల్లి వద్ద కృష్ణాలో కలుస్తుంది. మార్గమధ్యలో భూదాన్పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి వలిగొండ, రామన్నపేట, శాలిగౌరారం, అర్వపల్లి, కేతెపల్లి మీదుగా ప్రవహిస్తుంది. హైదరాబాద్ నగరం, రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరగడంతో మూసీ ప్రాజెక్టు నిండింది.
ముందస్తుగా అయిదు గేట్లు ఎత్తారు
భారీ వరద వస్తుందన్న అంచనాతో ముందస్తుగా అయిదు గేట్లు తెరిచి నీటిని కిందికి వదిలారు. తిరిగి మధ్యాహ్నం మూసివేసారు. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా 644.80 అడుగులకు చేరుకుంది.