రేవంత్ రెడ్డి ఎఫెక్ట్!: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు, డబ్బు పట్టుబడిందా?
కొడంగల్/మహబూబ్ నగర్: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు జరిగాయి. కోస్గి మండలం మీర్జాపూర్లోని నరేందర్ రెడ్డి నివాసంలో బుధవారం ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున ఇది జరిగింది. నరేందర్ రెడ్డి నివాసంలో భారీగా నగదు పట్టుబడినట్లుగా తెలుస్తోంది.
నరేందర్ రెడ్డి నివాసంలో సోదాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ నిర్ధారించారు. అతని ఇంట్లో సోదాలు జరిగినట్లు తనకు నివేదిక వచ్చిందని ఆయన తెలిపారు. కాగా, ఓ ఫాంహౌస్లో భారీగా డబ్బులు పట్టుబడ్డాయని తెలుస్తోంది. అందులోని డబ్బు ఎవరిది, వాటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా అన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారట. ఫాంహౌస్ నుంచి పదిహేను కోట్ల రూపాయలు పట్టుబడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి నరేందర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది.
అడ్రస్ కూడా లేని నన్ను.., 40ఏళ్ల తర్వాత మళ్లీ: కాంగ్రెస్ గెలుపుపై రేవంత్ రెడ్డి సెంటిమెంట్
రేవంత్ రెడ్డిపై నరేందర్ రెడ్డి పోటీ
కొడంగల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మంత్రి (ఆపద్ధర్మ) మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మహాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. గత కొద్ది రోజులుగా రేవంత్ తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
కొడంగల్ నియోజవకర్గంలో తనను ఒక్కడిని ఓడించడానికి కేసీఆర్ రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయని, అధికార పార్టీ అంతగా ఖర్చు చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన చాలారోజులుగా నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుటు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి అయిన నరేందర్ రెడ్డి నివాసంలో సోదాలు జరిగాయి.
డబ్బు దొరికిందా?
పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లోనూ పెద్ద ఎత్తున డబ్బు దొరికినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. కేవలం సోదాలను మాత్రమే నిర్ధారించారు. అతని ఇంటి నుంచి ఎంత స్వాధీనం చేసుకున్నారో తెలియాల్సి ఉంది. గురువారం ఎన్నికల సంఘం దీనిపై వివరాలు చెప్పనుంది.
రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు
కొడంగల్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న రేవంత్ రెడ్డి పైన నరేందర్ రెడ్డిని బరిలోకి దింపడంతో పాటు ఆయన గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావు, జితేందర్లకు అప్పగించారు. అయితే హరీష్ రావు.. కేసీఆర్ గెలుపు కోసం ఎక్కువగా గజ్వెల్కు పరిమితమయ్యారు. రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. రేవంత్ను దెబ్బతీసేందుకు పలువురు కొడంగల్ టీడీపీ నేతలను కూడా తెరాసలో చేర్చుకున్నారు. అయినా రేవంత్ను ఓడించలేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.