'రైతులకు అప్పు పుట్టడం లేదు, రుణాలు రీ షెడ్యూల్ చేయండి'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కష్టాలు లేకుండా రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అందరి మనసుల్లో ఏర్పడిందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులకు మేలు కంటే, కీడే ఎక్కువ జరుగుతోందని అన్నారు. రైతు బాగుంటేనే, రైతు కూలీ బాగుంటాడన్నారు. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టడం, రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని రైతులు భావించారు.
కానీ ఆదిశగా టీఅర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వ్యవసాయ పరిస్థితులు గురించి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల గురించి మనకు తెలియంది కాదన్నారు. గత ప్రభుత్వం రైతుల రుణమాఫీని ఏకమొత్తంలో చేసిందన్నారు.
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతు రుణమాఫీని దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణమాఫీ అంటీ విడదీసింది. 2009లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దశలవారి రుణమాఫీ వల్ల రైతులకు ఏమీ ఒరగడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఖరితో రైతులకు అప్పులు కూడా పుట్టడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నాం... కానీ, పరిస్థితి అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు కొత్త రుణాలు రావడం లేదన్నారు. దయచేసి రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. 23 వేల కోట్లున్న రైతుల రుణమాఫీని 17 వేల కోట్లకు కుదించారన్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే రైతులకు ఊరట లభించేదన్నారు. కానీ జూన్, జులైలో చేయాల్సిన రైతు రుణమాఫీని సెప్టెంబర్కు చేశారన్నారు.
ఈ పరిస్థితుల్లో బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ బకాయిలను మాఫీ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ధనికరాష్ట్రం కావడానికి కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క సోలార్ యానిట్ను ఏర్పాటు చేయలేదన్నారు.
రైతులకు ఇంతవరకు ఒక్క రూపాయి అయినా సబ్సిడీని ఇవ్వగలిగారా అంటూ మండిపడ్డారు. అనారోగ్యంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అంటున్నారని, ఇది కూడా ఒక కారణం అయి ఉందవచ్చని కానీ, తినటానికే లేని రైతు వైద్యం ఎలా చేయించుకుంటాడని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది రైతులు చనిపోయారని అన్నారు. ఈ లెక్కలు తాను చెబుతున్నవి కావని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పినవన్నారు. తెలంగాణలోని 1400 కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 60 నుంచి రూ. 70 కోట్లు సరిపోతాయన్నారు.
మా హయంలో ఆత్మహత్యలు జరగలేదని తాను చెప్పడం లేదన్నారు. రైతులకు మద్దత ధర ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఇప్పటికైనా కరువు మండలాలను ప్రకటించాలని కోరారు. పత్తిరైతు క్వింటాకు ప్రభుత్వం రూ. 500 బోనస్ ప్రకటించాలన్నారు. అదే విధంగా వరి, మొక్కజొన్నలకు రూ. 200 బోనస్ ప్రకటించాలని కోరారు.
6 శాతం వడ్డీని సహాకార బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయని చెప్పిన ఆయన ఆ ఆరుశాతం వడ్డీని ప్రభుత్వమే భరించాలన్నారు. ట్రాక్టర్ ఉందనే నెపంతో రైతులకు ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు.