మోడీ విప్పారు: నోట్ల రద్దుపై చంద్రబాబుతో కెసిఆర్, వారితో సానియా ఫొటో
రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్లో ఏర్పాటు చేసిన విందులో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు, కెసిఆర్ చాలా ఉల్లాసంగా మాట్లాడుకున్నారు.
రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్లో ఏర్పాటు చేసిన విందులో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు, కెసిఆర్ చాలా ఉల్లాసంగా మాట్లాడుకున్నారు.
హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయానికి దారితీసిన కారణాలపై ప్రధాని నరేంద్ర మోడీ తన వద్ద మనసు విప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చెప్పారు. మంగళవారం రాత్రి వారిద్దరూ హైదరాబాద్లోని రాజ్భవన్ ఆవరణలో కాసేపు సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నారు.
హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. తన వద్దకు వచ్చిన అతిధులను పలకరించి వారితో ఫొటోలు దిగే పనిలో రాష్ట్రపతి ఉండటంతో ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడంలో మునిగిపోయారు.
ఇరవై నిమిషాల పాటు ఇద్దరూ నిలబడే మాట్లాడకున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ వారిద్దరి మధ్యలో ఉండి వారి సంభాషణను విన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి తలా కొంతసేపు వారి వద్ద ఉన్నారు. పక్కన ఎవరో ఒకరు ఉండటంతో ముఖ్యమంత్రులు రాజకీయాల జోలికి వెళ్ళకుండా నోట్ల రద్దు తదితర పరిణామాలపై ఎక్కువ సేపు మాట్లాడుకొన్నారు.
మోడీతో సంభాషణపై కెసిఆర్..
తాను కొద్ది రోజుల క్రితం ప్రధానిని కలిసినప్పుడు ఆయనతో జరిగిన సంభాషణను కెసిఆర్ చంద్రబాబుకు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా దానికి ముందస్తు కసరత్తు కొంత చేసి ఉంటే బాగుండేదని, అది చాలకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తాను ప్రధానితో చెప్పినట్లు ఆయన తెలిపారు. అప్పుడు ప్రధాని భావోద్వేగంతో తనతో మాట్లాడినట్లు తెలిపారు.
మోడీ ఇలా అన్నారట..
తనను ఒక రాష్ట్రం ప్రజలు మూడుసార్లు ముఖ్యమంత్రిని చేశారని, దేశ ప్రజలు తన వంటి సాధారణ వ్యక్తికి ప్రధానిగా అవకాశం ఇచ్చారని, వారి రుణం తీర్చుకోవడానికే అన్నీ ఆలోచించే నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకొన్నానని మోడీ చెప్పినట్లు కెసిఆర్ వివరించారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమేనని, తర్వాత ప్రజలకు, దేశానికి మంచే జరుగుతుందన్న అభిప్రాయంతో ప్రధాని ఉన్నట్లు తెలిపారు.
పులి మీద స్వారీ అని చెప్పా...
మీరు పులి మీద స్వారీ చేస్తున్నారని కూడా తాను మోడీతో చెప్పినట్లు కెసిఆర్ తెలిపారు. తాను అన్నింటికీ సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకొన్నానని, దేశంలో అవినీతిని... నల్లధనాన్ని నిర్మూలించడానికి ఇది తప్పదని మోడీ చెప్పినట్లు వివరించారు.
చంద్రబాబు చలోక్తి విసరారు..
చాలా విషయాలు మోడీ, మీరు మాట్లాడుకున్నారన్న మాట అని చంద్రబాబు ఛలోక్తి విసిరారు. మీరు ఎక్కువసార్లు కలుస్తారు... నేను అన్నిసార్లు కలవను కదా అని కేసీఆర్ చెప్పారని సమాచారం. నోట్ల రద్దు వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నా డిజిటల్ కరెన్సీని ఒకసారి అలవాటు చేస్తే వారు చాలా తేలిగ్గా అల్లుకుపోగలరన్న నమ్మకం తనకు వచ్చిందని చంద్రబాబు కేసీఆర్తో చెప్పారు.
మొదట్లో భయపడ్డానని చంద్రబాబు
కరెన్సీ లేకపోతే ఎలా అని తాను కూడా మొదట్లో భయపడ్డా. కాని తర్వాత అందుబాటులో ఉన్న టెక్నాలజీని లోతుగా పరిశీలిస్తే చాలా తేలికైన విధానాలు అందుబాటులో ఉన్నాయని, వేలిముద్రతోనే మొత్తం చెల్లింపులు జరిగే విధానం బాగా తేలిగ్గా ఉందని చంద్రబాబు చెప్పారు. తమ వద్ద దాన్నే బాగా ప్రోత్సహిస్తున్నామని, కొత్త టెక్నాలజీని వినియోగించడంపై చాలా మందికి మనసులో తెలియని భయం ఉంటుందని, ఒకసారి అది పోగొడితే చాలా వేగంగా అలవాటు పడిపోతారని, మనం ముందుకు వస్తే సమాజం కూడా ముందుకు వస్తుందని చంద్రబాబు అన్నారు.
కెసిఆర్ చంద్రబాబును ఇలా అడిగారు...
తమ రాష్ట్రంలో నగదు రహిత గ్రామాలను ఎంపిక చేసి వాటి సంఖ్యను పెంచుకొంటూ వెళ్తున్నామని కెసిఆర్ చెబుతూ మీ వద్ద ఏం చేస్తున్నారని చంద్రబాబును కేసీఆర్ అడిగారు. తాము ఇటువంటి గ్రామాలను ప్రోత్సహిస్తూనే మొత్తంగా అందరికీ నగదు లేకుండా చెల్లింపులు ఎలా చేయాలన్నది అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఫలితాలు బాగున్నాయని చంద్రబాబు వివరించారు.
నోట్ల రద్దుతో ఆదాయానికి గండి...
నోట్ల రద్దు వల్ల ఆదాయం కొంత తగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయం ఇరువురు ముఖ్యమంత్రులు కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు వివాదాల పరిష్కారానికి సత్వర ప్రయత్నం చేయాలని ఇరువురు అబిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఎపి సచివాలయం భవనాలను తమకు అప్పగించాలని కోరిన విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. విడివిడిగా కాకుండా అన్ని అంశాలను ఒకేసారి పరిష్కరించుకొంటే ఎవరికీ ఇబ్బంది ఉండదని, ఈ భవనాల అంశం కూడా తమ మంత్రుల కమిటీకే అప్పగించామని చంద్రబాబు వివరించారు.
రాజ్భవన్లో విందు ఇలా..
గవర్నర్ విందుకు మాజీ గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి, ఏపీ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, తెలంగాణ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ , ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, ఎండీ మహమూద్అలీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, సీఎం కేసీఆర్ దంపతులు ఒకే టేబుల్లో కూర్చుని భోజనం చేశారు. క్రీడాకారులు సానియామీర్జా, పీవీ సింధుతో కలిసి కవిత భోజనం చేశారు.
రాజ్భవన్ మెనూ ఇది...
గోంగూర పచ్చడి, గ్రీన్సలాడ్, చెర్రీటమాటో, గ్రిల్డ్ వెజిటేబుల్ సలాడ్, వంకాయ, టమాటో పచ్చడి, పాపడ్, రాయితా, యోగ్హర్త్, సబ్ బదామి షోర్బా, అచారీ పనీర్, భట్టి కా ఆలూ, వెజిటేబుల్ శికంపూర్ కబాబ్, పనీర్ ఖత్తా ప్యాజ్, నిజామీ హండీ, లసూనీ చిరోంజి పాలక్, ఆలూ కట్లియాని, హైదరాబాద్ ఖట్టి దాల్, హైదరాబాద్ సబ్జ్ బిర్యానీ, మిర్చీ కా సాలన్, స్టీమ్డ్ రైస్, బ్లూబెర్రీ ఫిర్నీ, రోస్ క్రీమ్, మలాయి కుల్ఫీ విత్ ఫాలుదాను విందులో ఏర్పాటు చేసారు..
సిఎంలతో సానియా ఇలా...
ముఖ్యమంత్రులు మాట్లాడుకొంటున్నప్పుడు క్రీడాకారిణులు సానియా మీర్జా, పీవీ సింధు వారి వద్దకు వచ్చారు. మీరిద్దరూ ఒకేచోట చాలా తక్కువగా ఉంటారని, మీ ఇద్దరితో కలిసి మేం సెల్ఫీ తీసుకొంటామని సానియా కోరగానే సీఎంలిద్దరూ నవ్వుతూ అంగీకరించారు. ఫొటో తీసేటప్పుడు నవ్వండి సార్ అని సానియా విజ్ఞప్తి చేసినప్పుడు ఇద్దరూ గట్టిగా నవ్వేశారు.