పూవులిచ్చిన బాబు, శాలువా కప్పిన కెసిఆర్, 15రకాల ఆంధ్రా వంటకాలతో లంచ్
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు బెజవాడ చేరుకున్నారు. ఆయనకు హెలిప్యాడ్ వద్ద మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, కామినేని శ్రీనివాస్ రావులు స్వాగతం పలికారు.
అనంతరం కెసిఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇంటి వద్ద ఏపీ సీఎం తెలంగాణ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి కెసిఆర్ను చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం ఇంట్లో చండీయాగ ఆహ్వాన పత్రికను అందించారు. చంద్రబాబుకు కెసిఆర్ శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు.
యాగంకు సంబంధించిన విషయాలను కెసిఆర్... బాబుతో చెప్పారు. ఆయన సాదరంగా విన్నారు. వారిద్దరు కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. కెసిఆర్ అనుకున్న సమయానికి కంటే పావుగంట ఆలస్యంగా వచ్చారు. కెసిఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ కోసం చంద్రబాబు పదిహేను రకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో నాటుకోడి, చేపల పులుసు, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ ఖాజా, ఉలవచారు, టమోటా పప్పు, మునక్కాయ సాంబారు, బిర్యానీ, గడ్డ పెరుగు, పూతరేకులు వంటి మిఠాయిలు, వివిధ రకాల పండ్ల ముక్కల్ని సిద్ధం చేశారు.