సాధారణ చేరికలు కావు: ఫిరాయింపులకు కెసిఆర్ కొత్త అర్థం
హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి తమ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి జరుగుతన్న ఫిరాయింపులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొత్త అర్థం ఇచ్చారు. తెరాసలోకి జరుగుతున్న చేరికలు ఫిరాయింపులు కావని, పునరేకీకరణ అని ఆయన అన్నారు.
కాంగ్రెసు నాయకుడు బసవరాజు సారయ్య తెరాసలో చేరిన సందర్భంగా ఆయన మంగళవారంనాడు మాట్లాడారు. తెలంగాణలోని రాజకీయ శక్తులన్నీ ఏకమై అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సారయ్యను కలుపుకుని వెళ్తూ వరంగల్ నాయకత్వం పనిచేయాలని ఆయన సూచించారు.
తెలంగాణవాళ్లకు పాలన సాధ్యం కాదన్నవారికి సమాధానం చెప్పాలని కెసిఆర్ అన్నారు. రాజకీయాలంటే ఐదేళ్లకోసారి ఎన్నికలని, ఇందులో ఓ పార్టీకి విజయమూ మరో పార్టీకి అపజయమూ సాధారణమని ఆయన చెప్పారు. వరంగల్ నగరానికి రూ. 300 కోట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు.
విద్యారంగంలో ఫలితాలపై కెసిఆర్ అసంతృప్తి
విద్యాశాఖ సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారనాడు సమీక్ష నిర్వహించారు. ఆర్థికస్థోమత కలిగిన వారి పిల్లలు మంచి స్కూళ్లలో చదువుతారని కెసిఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ బాధత్య అని చెప్పారు
పేద విద్యార్థుల చదువు కోసం పెట్టిన ఖర్చు బావితరాలకు ఉపయోగపడుతుందని, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. విద్య కోసం ప్రతీ ఏడాది రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రభుత్వ విద్యలో అనుకున్న ఫలితాలు రావడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు ఎల్కేజీ నుంచి ఉన్నతస్థాయి చదువులు చదువుకోవడానికి అనుగుణంగా విద్యా విధానం ఉండాలని, అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని, విద్యాశాఖలో 14 విభాగాలు ఉన్నాయి. అవసరంలేని విభాగాలను తొలగించాలని అన్నారు. ఆర్కైవ్, గ్రంథాలయాల విభాగాలకు కల్చరల్ శాఖకు అప్పగించాలని సూచించారు.
అన్ని భాషల అకాడమీలను ఒకే అకాడమీగా మార్చాలని, అన్ని రకాల విద్యలను విద్యాశాఖ పరిధిలోకి తేవాలని అన్నారు. ఐటీఐని కార్మిక శాఖ నుంచి సాంకేతిక విద్యాశాఖకు బదిలీ చేయాలని, ఏపీ రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అవసరంలేని పథకాలను తొలగించాలని అన్నారు. యూనివర్సిటీలంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేదని, ఇప్పుడు యూనివర్సిటీల పరిస్థితి ఇవాళ గందరగోళంగా మారిందని కెసిఆర్ అన్నారు.
కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులను రాష్ట్ర పథకాల్లో ఎలా కలుపుకోవాలో ఆలోచించాలని సూచించారు. దానికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని తెలిపారు. విద్యార్థులు లేకున్నా కొన్ని స్కూళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై ఇలాంటి విషయంలో ఓ విధానం రూపొందించాలని స్పష్టం చేశారు.
చాలా స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అన్నారు. ఈ విషయంలో గ్రామ పంచాయతీలను బాధ్యులను చేస్తూ చట్టం చేస్తామన్నారు. విద్యా సంస్థలకిచ్చే కాంటిజెన్సీ నిధులు కూడా సక్రమంగా ఉపయోగపడాలన్నారు.