'గత 70ఏళ్లలో చేయలేనిది.. టీఆర్ఎస్ రెండున్నరేళ్లలో చేసింది'
గత 70ఏళ్లలో మునుపటి ప్రభుత్వాలు చేయని పనిని రెండున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని కేసీఆర్ ధీమాగా చెప్పారు.
హైదరాబాద్: శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో జాతీయ రహదారుల అంశంపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గత 70ఏళ్లలో మునుపటి ప్రభుత్వాలు చేయని పనిని రెండున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని కేసీఆర్ ధీమాగా చెప్పారు.
కేసీఆర్ మాటల్లో..
ఆనాడు ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తులు తెలంగాణ కోసం ఎంతో బాధపడ్డారు. కేంద్రప్రభుత్వ సహకారంతో ఇప్పుడు కొంతమేర సాధించుకోగలుగుతున్నాం. నూతన జాతీయ రహదారుల నిర్మాణంలో టీఆర్ఎస్ విజయవంతమైంది.ఈ విజయం బంగారు తెలంగాణ నిర్మాణంలో ఓ మలుపు. కేవలం రెండున్నరేళ్లలో అకుంటిత దీక్షతో సాధించుకున్నాం.
జాతీయ రహదారుల గుర్తింపు విషయంలోను గతంలోను తెలంగాణపై వివక్ష ఏర్పడింది. తెలంగాణ అభివృద్దికి గొడ్డలిపెట్టుగా ఉన్న ఈ పరిస్థితిని రూపుమాపేందుకు.. జాతీయ రహదారుల కోసం టీఆర్ఎస్ కేంద్రం వద్ద బలంగా ప్రతిపాదించింది.
తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 2.2వేల కి.మీ మాత్రమే తెలంగాణలో జాతీయ రహదారులున్నాయి. అప్పటికీ జాతీయ రహదారుల సగటు 2.8వేల కి.మీ. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణనే ఈ విషయంలో వెనుకబడింది.
ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు జాతీయ రహదారుల కోసం కేంద్రం వద్ద పట్టువదలకుండా ప్రయత్నించాం. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారికి జాతీయ రహదారులపై నివేదికలు సమర్పించాం. 2776కి.మీ కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయించుకోవడంలో ప్రభుత్వం ఇప్పుడు సఫలమైంది. గత ప్రభుత్వాలు 70ఏళ్లలో సాధించిన దానికన్నా రెండున్నరేళ్లలో ప్రభుత్వం దీన్ని సాధించింది.
బాసర-భైంసా, నిజాంపేట్-నారాయణఖేడ్, హైదరాబాద్-మొయినాబాద్-కొడంగల్-మన్నెగూడ, కోదాడ-దేవరకొండ-మిర్యాలగూడ211కి.మీ, సంగారెడ్డి-తూప్రాన్ -జగదేవ్ పూర్, చౌటుప్పల్ -శంకరపట్నం-ఆమనఘల్, వరంగల్-ఖమ్మం 120కిమీ, కరీంనగర్-ఎల్లారెడ్డి-పిట్లం 165కిమీ, మంచిర్యాల-చంద్రపూర్ వయా ఆసిఫాబాద్, మిర్యాలగూడ-పిడుగురాళ్ల, జహీరాబాద్-బీదర్.. తదితర రహదారులన్ని కలిపి త్వరలోనే 5303కిమీ జాతీయ రహదారులు తెలంగాణలో ఏర్పడబోతున్నాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ సగటును మించి:
ప్రస్తుత రాష్ట్ర జాతీయ రహదారుల సగటు జాతీయ సగటును మించిపోయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2690కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. ఎన్.హెచ్ పరిధిలో 8వేల కోట్ల అభివృద్ది పనులకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతంలో హామి ఇచ్చారని గుర్తు చేశారు.
మారుమూల అటవీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి ప్రతిపాదనలు పంపించామని. హైదరాబాద్ నగరానికి రోజురోజుకు పెరుగుతున్న వాహనాల తాకిడి రీత్యా, నగరం చుట్టూ మరో రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపించినట్టుగా కేసీఆర్ తెలిపారు. 338కి.మీ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కేంద్రానికి సూచించినట్టుగా తెలియజేశారు.