మాది కుసంస్కారమా?: జానా కితాబును గుర్తు చేసిన కెసిఆర్
హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రసంగానికి అడ్డు తగులుతున్న ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్పై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అనుమానాలకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెపుతుండగా ప్రతిపక్ష సభ్యులు తరచూ అడ్డుకోవడం ప్రారంభించారు.
దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. మంత్రి చెప్పే మాటలు వినాలని, అడ్డు తగలవద్దని సూచించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాన్ని విని అధికార పార్టీ సభ్యులు సంస్కారవంతంగా వ్యవహరించారని ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇచ్చిన కితాబును ఆయన గుర్తు చేశారు.
"మేం మాట్లాడితే కు సంస్కారం, మీరు మాట్లాడితే సంస్కారమా?" అని అడిగారు. కాంగ్రెసు సభ్యులు నిశ్శబ్దంగా కూర్చునేలా చూడాలని కెసిఆర్ జానారెడ్డిని కోరారు. ఇప్పటి వరకు ఈ సభలో అధికార టీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది కేవలం గంటా 26 నిమిషాలు మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2 గంటల 53 నిమిషాలు ప్రసంగించిందని వెల్లడించారు.
ఆర్థిక మంత్రి మొత్తం వివరణ ఇచ్చేదాకా చూడాలని అభ్యంతరాలుంటే రాసుకుని తర్వాత ప్రశ్నించాలని ప్రతిపక్ష సభ్యులకు సీఎం సూచించారు.
కాళ్ల కింద భూమి కదులుతోంది....
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజానురంజక బడ్జెట్ను చూస్తే ప్రతిపక్షాలకు కాళ్ల కింద భూమి కదిలిపోతోందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు
మీ పార్టీ పత్తాలేకుండా పోతుందనే ఈ విమర్శలు తప్ప మరోటి కాదని అన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. తమ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పరిశ్రమను కూడా మూసేయలేదని తెలిపారు.
దేశంలో నేరాలు తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రూపొందబోతోందని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆనాడు రాష్ట్రం విడిపోతే మత కలహాలు జరుగుతాయని పుకార్లు పుట్టించారని గుర్తు చేశారు. కానీ ఇవాళ నగరం శాంతిభద్రతలతో విరాజిల్లుతుందని స్పష్టం చేశారు. ఇవాళ దేశంలోని పలు రాష్ర్టాలకు తెలంగాణపై విశ్వాసం నెలకొని ఉందని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవిక బడ్జెట్, ప్రజా కోణం ఉన్న బడ్జెట్ అని ఆర్థిక మంత్రి అన్నారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సభ్యులు వారి పదేళ్లపాలనలో చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. ఎమ్ఆర్ఆర్ కింద తమ ప్రభుత్వం 8,138.52 కిలోమీటర్ల మేర రోడ్లు వేయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రోడ్లన్నీ అస్త్యవస్థంగా ఉండేవని తెలిపారు.
కెజీ టూ పీజీ ఉత్తేదే...
కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయడానికి మరితం సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోందని, అంత వరకు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం అమలయ్యే వరకు కనీసం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలోనైనా కేజీ టు పీజీ చదువుకునేందుకు పేద విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు చట్టంలో పేర్కొన్నట్లు పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని కోరారు.
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఇష్టారాజయంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటికి అడ్డూఅదుపు లేకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఊహాజనిత బడ్జెట్
డబుల్బెడ్రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ మాట మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి ఆరోపించారు. శనివారం భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడారు. మిషన్ భగీరథ దేశంలోనే అతి పెద్దస్కాంగా మిగులుతుందన్నారు.
నిధుల దుర్వినియోగంపై సభలో సమాధానం రాలేదని ఆయన అన్నారు. సభ నుంచి ప్రభుత్వం పారిపోయిందని చిన్నారెడ్డి ఎద్దేవాచేశారు. గత బడ్జెట్లో రూ. 85వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు. ఇది ఊహా జనిత బడ్జెట్ అని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష సభ్యుల సూచనలను అవహేళన చేయటం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క హితవుపలికారు. 2014-15 బడ్జెట్ అంచనాలను ఇంతవరకు చేరుకోలేదన్నారు. ఇప్పుడు రూ.లక్షా 30వేల కోట్లకు పైగా ప్రతిపాదించారని, అయితే కేటాయింపుల ప్రకారం చేయబోయే ఖర్చుల వివరాలను ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. ప్రజల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.
నిజాం షుగర్స్ తెరిపించాలి...
నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని టీడీఎల్పీ నేత రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పాలని నిలదీశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను పక్కనపెట్టారని విమర్శించారు. అంగ వైకల్యం ఉన్నవారిని వివాహం చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకం, ఒకరికి ఉద్యోగం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. ఓయూలో లాఠీచార్జ్లు జరుగుతున్నాయని, సభలో నిరసన తెలిపే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.