మౌనదీక్షతో ప్రభుత్వంపై పోరుకు సిద్దమైన కోదండరాం
హైదరాబాద్ : గత కొన్నాళ్లుగా ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తూ వస్తోన్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం.. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు దిగబోతున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఇందిరాపార్కు వద్ద ఆయన మౌనదీక్ష చేయబోతున్నారు.
దీని గురించి మాట్లాడిన ఆయన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఇంతవరకు పూర్తి కాలేదని, అందువల్ల భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి ప్రజల్లో చాలా అనుమానాలు నెలకొని ఉన్నాయన్న కోదండరాం.. భూసేకరణ ద్వారా సేకరించిన భూమిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తారేమోనన్న అనుమానం ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఏదేమైనా మౌనదీక్ష ద్వారా ప్రభుత్వానికి మరోసారి జేఏసీ సెగ తగిలించబోతున్నారు కోదండరాం.