ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను.. అందుకే ఎండీని నియమించడం లేదు: కోమటిరెడ్డి విసుర్లు
ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు కోరుతుంటే.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం కూడా హక్కేనని.. దానిని హరించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు కోరుతున్నది న్యాయమైన డిమాండ్లే తప్ప.. గొంతెమ్మ కోరికలు కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీ కార్మికులు హయత్నగర్ డిపో వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. వారి నిరసనకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మద్దతు తెలిపారు. తర్వాత ప్రసంగిస్తూ.. ఆర్టీసీకి తక్షణమే ఎండీని నియమించాలని హైకోర్టు స్పష్టంచేసినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తోందని విమర్శించారు. కోర్టు మాటలను కూడా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని, పెడచెవిన పెడుతుందని మండిపడ్డారు. ఆర్టీసీకి ఎండీని నియమించకపోవడానికి కారణం ఏంటో వివరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో ఉన్న 50 వేల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీకి విలువైన భూములు, భవంతులు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుర్తుచేశారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నుపడ్డ కేసీఆర్.. కావాలనే ఎండీని నియమించడం లేదని ఆరోపించారు. గత 15 నెలల నుంచి ఓ కార్పొరేషన్కు ఎండీ లేకపోవడం ఏంటీ అని ప్రశ్నించారు. దీనిని బట్టి సీఎం కేసీఆర్ వైఖరి ఏంటో అర్థమవుతోందని తెలిపారు.