పచ్చని తెలంగాణలో బీజేపి చిచ్చు.! అందుకే ఉపఎన్నిక తెచ్చిందన్న మంత్రి జగదీష్ రెడ్డి.!
మునుగోడు/హైదరాబాద్ : పంటపొలాలతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు రగిల్చేందుకే భారతీయ జనతా పార్టీ మునుగోడుకు ఉప ఎన్నికలు తెచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల వెనుక ముమ్మాటికీ ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆయన మండిపడ్డారు. మరో సంవత్సరంలో రాష్ట్ర శాసనసభ కు సాదారణ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఎందుకు రాజీనామా డ్రామాలు అంటూ ఆయన మండిపడ్డారు. మునుగోడు కు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గ పరిధిలోని వెలిమికన్నే,చీకటిమామిడి తదితర గ్రామంలో టి ఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలసి ఆయన ప్రచారం నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఉదృతం..
మునుగోడు నియోజక వర్గంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి స్వార్థం కోసం ఒక వ్యక్తి కుటుంబ ప్రయోజానాల కోసమే ఈ ఉప ఎన్నికను ప్రజలపై బలవంతంగా రుద్దిందని ధ్వజమెత్తారు. 2018 లో ఎన్నికయిన నాటి నుండి అధికారంలో లేక పోవడంతో అభివృద్ధి చెయ్య లేక పోయానంటూ బీరాలు పలుకుతున్న రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్టు కోసమే పార్టీ మారి రాజీనామా చేసి బిజెపి కుతంత్రాలలో బాగంగా ఈ ఎన్నికలు తెచ్చారన్నారు.
నాలుగు ఏళ్లలో చెయ్యని అభివృద్ధి ఈ సంవత్సరంలో ఎలా చెయ్య గలుగుతారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఫ్లోరోసిస్ మహమ్మారి ని కేవలం ఆరు ఏండ్లలో తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావుకు దక్కుతుందన్నారు.
తెలంగాణాలో మంటలు రగిల్చేందుకు ఉప ఎన్నిక..
కృష్ణా, గోదావరి నదీ జలాలతో ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకానికి 50,000 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అందుకు గాను 12000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి అందించాలంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులు బుట్ట దాఖలు చేసిన మోదీ సర్కార్ తెలంగాణకు పైసా విదిల్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు.
అదే బిజెపి తెలంగాణాలో నెరుపుతున్న కుట్ర రాజకీయాలలో భాగస్వామిగా మారి రాజకీయ జన్మనినిచ్చిన కాంగ్రెస్ ను కాదని బిజెపి లో చేరినందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టుల రూపంలో ఇచ్చిన నజరానా 18,000 కోట్లన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.
ఇది ప్రధాని మోదీ పన్నిన కుట్ర..
తెలంగాణా లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి అమలు అవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునే కుట్రలో భాగంగానే మోదీ, అమిత్ షా ద్వయం ఇటువంటి కుట్రలకు తెరలేపిందని ఆయన విరుచుకుపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మెడ మీద కత్తి పెట్టి వత్తిడి తేవడం అందులో భాగమే నన్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కంఠంలో ప్రాణముండగా తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కానివ్వబోమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే గుజరాత్ లో మోటర్లకు మీటర్లు బిగించారన్నారు. అక్కడ రైతాంగం ఎకరాకు 1500 రూపాయల చొప్పున నాలుగు ఎకరాలు ఉన్న రైతు నెల ఒక్కింటికీ 5,500 రూపాయలు చెల్లిస్తున్నారన్నారు.
మునుగోడు లో బిజెపి కి ఓటేస్తే మురిగిపోతుంది..
తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు,వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్,పెట్టుబడి సాయంగా రైతాంగానికి అందిస్తున్న రైతుబందు పధకం,పేదింటి ఆడపిల్ల పెళ్లికి తోడ్పాటు నందించేందుకు ప్రవేశ పెట్టిన కళ్యాణలక్ష్మీ పధకాలు కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని వనికిస్తున్నాయాన్నారు.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ తో సహా దేశ వ్యాప్తంగా ఇవే డిమాండ్లతో ప్రజలు తిరగ బడుతారన్న భయంతో బెంబేలెత్తుతున్న కమల నాధులు తెలంగాణలో చిచ్చు రగిల్చేందుకే మునుగోడుకు ఉప ఎన్నికలు బలవంతంగా తెచ్చి పెట్టారన్నారు. మునుగోడులో పొరపాటున బిజెపి కి ఓటు వేస్తే జరగబోయే ప్రమాదం కుడా ఈ రూపంలో పొంచి ఉందంటూ జగదీష్ రెడ్డి హెచ్చరించారు.