‘ఇట్రావయ్యా బాబూ.. చెప్తే కూడా అర్థం కాదు’: మంత్రి కొప్పులను కేసీఆర్ అవమానించారా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అవమానించారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వాస్తవం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ప్రగతిభవన్లో గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో తండ్రి హోదాలో మంత్రులను ఒకవైపు.. ఎమ్మెల్యేలను ఒకవైపు కూర్చోవాలని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు.
కేసీఆర్ తండ్రిలాంటి వారంటూ కొప్పుల ఈశ్వర్
అయితే, తాను ఎమ్మెల్యేల వరుసలో కూర్చోవడంతో.. మంత్రులవైపు కూర్చోవాల్సిందిగా కేసీఆర్ సూచించారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రికి, దళిత సమాజానికి అవమానం జరిగిందని చిత్రీకరించడం సరికాదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. తమ పార్టీ అనేది ఒక కుటుంబం అని, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి తండ్రి లాంటివారన్నారు. కుటుంబసభ్యులను సంభోదించినట్లుగానే కేసీఆర్ సంభోదించారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
కేసీఆర్ కాదు.. హరీశ్ రావు ఏం చేశారో చూశారా?: కొప్పుల ఈశ్వర్
ఆ పక్కన సహచర మంత్రి హరీశ్ రావు నా కోసం పక్కకు జరిగి తనకు కుర్చీ ఇచ్చారని ఈశ్వర్ తెలిపారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు గమనించాలన్నారు. జరిగిన విషయం గుర్తించి పూర్తిగా తెలుసుకోకుండా.. ఎవరికివారు, వారికి అనుకూలంగా ఊహించుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బురదజల్లే రాజకీయం మానుకోవాలని, లేదంటే అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.
‘ఇట్రావయ్యా బాబూ.. చెప్తే కూడా అర్థం కాదు' అంటూ కేసీఆర్
కాగా, దళిత మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్ను అవమానించారంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా వీడియోలు పంచుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొప్పుల ఈశ్వర్ వారికి సమాధానమిచ్చారు. కాగా, సమావేశంలో కేసీఆర్.. మంత్రి కొప్పుల ఈశ్వర్ను.. 'ఇట్రావయ్యా బాబూ.. చెప్తే కూడా అర్థం కాదు' అంటూ మంత్రుల వైపునకు పంపిస్తారు.