జడ్జి కొడుకుపై మంత్రి పద్మరావు గన్మెన్ల దాడి, కేసు: హరీష్ రావు డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ మంత్రి పద్మారావు కాన్వాయ్లోని కారును ఢీకొట్టాడంటూ.. మంత్రి గన్మెన్లు అధనపు జడ్జి కుమారుడి పైన దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి చెవికి తీవ్ర గాయాలయ్యాయి. తండ్రికి విషయాన్ని వివరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు మారేడుపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
వెస్ట్ మారెడ్పల్లిలోని జడ్జి క్వార్టర్స్లో ఉండే రంగారెడ్డి జిల్లా ఏడవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస రావు తనయుడు గణేష్ బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన వైఎంసీఏ వద్ద ఉన్న హిమాలయ బుక్ స్టోర్స్కు వెళ్లాడు. అతను ఇంటికి వస్తుండగా ఓ క్రాస్ వద్ద మంత్రి పద్మారావు కాన్వాయ్ మారెడ్ పల్లి నుంచి మెయిన్ రోడ్డు వైపు వచ్చింది.
దీంతో బైకు అదుపు తప్పి కాన్వాయ్ను ఢీకొట్టింది. వెంటనే మంత్రి గన్మెన్లు కాశీరాం, చాంద్ పాషాలు కారు దిగి గణేష్ పైన చేయి చేసుకున్నారు. ఇంటికి వెళ్లిన గణేష్ తండ్రికి చెప్పారు. గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లారు.
ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయింది. కేసును గోపాలపురం పోలీస్ స్టేషన్కు బదలీ చేశారు. ఘటన జరిగిన సమయంలో మంత్రి పద్మారావుతో పాటు కార్యకర్తలు అక్కడే ఉన్నారని చెబుతున్నారు.
హరీష్ రావు ఇంటి కారు డ్రైవర్ ఆత్మహత్య
మంత్రి హరీష్ రావు ఇంటి డ్రైవర్గా పని చేస్తున్న కృష్ణాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన చంద్రయ్య, రామవ్వ దంపతుల చిన్న కుమారుడు కృష్ణాజీ.
అతడు ఏడాదిగా మంత్రి హరీష్ రావు వద్ద వ్యక్తిగత డ్రైవరుగా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం శుభకార్యం కోసం ఇంటికి వెళ్లాడు. గజ్వెల్లో పురుగుల మందు కొని మార్గమధ్యలో తాగి ఇంటికి వెళ్లాడు. అతను వ్యక్తిగత కారణాలతో పాటు పంట దిగుబడి రాలేదన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెబుతున్నారు.