దేశాన్ని దివాళా తీయించింది మోదీనే.! శ్రీధర్ రెడ్డి చేరిక సభలో బీజేపీపై మండిపడ్డ కేటీఆర్.!
హైదరాబాద్: కేంద్ర బీజేపి ప్రభుత్వంపై మంత్రి తారక రామారావు విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజానికానికి చేసిందేమీ లేదని, నోట్ల రద్దుతో ఆర్థిక అభివృద్ధికి మోదీ విఘాతం కలిగించారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్బంగా కేంద్ర బీజేపిపై అనేక ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా చూపిస్తామని అన్నారు. ఆరేళ్లలో 2.72 లక్షల కోట్ల రూపాయల పన్నులు కేంద్రానికి ఇచ్చామని, తెలంగాణకు ఇచ్చింది మాత్రం కేవలం 1,43,329 కోట్ల రూపాయలేనని తెలిపారు.
కేంద్రంపై విరుచుకుపడ్డ యువమంత్రి..
ఆరేళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్దే విజయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అయినా విపక్షాలు తీరు మార్చుకోవడం లేదని, బీజేపీ నేతలు ప్రజలకు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్వేషపు రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదన్నారు. ప్రతి మతానికి తెలంగాణలో చోటు ఉంటుందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ధర్మంకాదని, మతం తమకు ఎప్పటికి ప్రచారాస్త్రం కాదని కేటీఆర్ స్పష్టం చేసారు.
తెలంగాణ నిధుల విషయంలో బీజేపి అవాస్తవాలు..
తెలంగాణ బీజేపీకి చెందిన కీలక నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. శ్రీధర్కు టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీధర్తో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈయనతో పాటు జూబ్లిహిల్స్ నియోజకవర్గ బీజేపీ నేత కంజర్ల మహేంద్ర యాదవ్ కూడా టీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణకు కేసీఆర్, కేటీఆర్ ల నాయకత్వం అవసరం..
చేరిక అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ బీజేపీలో వివిధ స్థాయిల్లో తాను పనిచేశానన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల భవిష్యత్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే భద్రంగా ఉంటుందన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. బీజేపీ కల్లబొల్లి మాటలు, అబద్దాల ప్రచారంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. దుబ్బాక చైతన్యమైన ప్రాంతమని, ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు నడకేనని శ్రీధర్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
టీఆర్ఎస్ ది ప్రజల పక్షం..
సోషల్ మీడియాలో ప్రజలకు ఉపయోగపడని వాగ్దానాలు చేసే వారితో బంగారు తెలంగాణ సాధ్యం కాదని, అందుకే తాను టీఆర్ఎస్లో చేరానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. కరోనా, వరదలొచ్చినా ప్రజలను ఆదుకునేది ఒక్క టీఆర్ఎస్ పార్టీనే అని శ్రీదర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరితపిస్తున్నారన్నారు. ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొని శ్రీధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.