Telangana లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు... జులై 1వ తేదీ నుంచి...
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు జులై 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయగా... ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటన విడుదల చేశారు.
ఆన్లైన్ తరగతుల ప్రారంభానికి అనుగుణంగా జులై 1 నాటికి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను సిద్దం చేస్తామని ఉమర్ ఖలీల్ వెల్లడించారు. దూరదర్శన్,టీ శాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతాయన్నారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా 70 శాతం సిలబస్ మాత్రమే ఉంటుందన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లు జులై 5 వరకు జరుగుతాయని తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ అనంతరం... వారికి కూడా దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతాయన్నారు.
టీవీలు,స్మార్ట్ఫోన్లు లేని విద్యార్థులు కాలేజీకి వచ్చి క్లాసులు వినేలా డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్,సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ సెకండియర్ చదువుతున్న దాదాపు 4లక్షల 73వేల పైచిలుకు మంది విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఫస్టియర్లో సాధించిన మార్కుల ఆధారంగా వారికి సెకండియర్లో మార్కులను ఇచ్చింది. ఫస్టియర్లో బ్యాక్ లాగ్స్ ఉన్నవారికి కనీస మార్కులు 45తో పాస్ చేసింది. సెకండియర్లోనూ అవే 45 మార్కులు వేసి పాస్ చేసింది.
తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పాస్ చేశాయి. అటు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.సీబీఎస్ఈ బాటలోనే సీఐఎస్సీఈ కూడా 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. పరీక్షల రద్దుతో ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతిలో విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నారు.