పుష్కర దృశ్యం.. ఓ సుందర కావ్యం(ఫొటోలు)
హైదరాబాద్: నదితో మనిషిది విడదీయరాని అనుబంధం. తల్లి బిడ్డెల బంధం. అందుకే నదుల ఒడ్డున్నే నాగరికత పుట్టింది. మౌనంగా నది ఎన్ని ముచ్చట్లు చెబుతదో. నిత్యం ప్రవహిస్తూ మనిషికి, ఇలా చైతన్యంగా బతకమని ప్రతీకాత్మకంగా బోధిస్తది. సకల జీవరాశులను అక్కున చేర్చుకొని అమ్మలా బతుకునిస్తది.
పచ్చదనానికి ప్రాణం పోసి బతుకుదెరువునిస్తది. సకల జీవరాశులను అక్కున భూతల్లి శిరస్సు మీద పాపిటబిల్లలా మెరుస్తది నది. వేల యేండ్ల చరిత్రకు, ఒక చెరగని సాక్ష్యం నదే. ఈ నదిని స్మరించుకోవడం, నదిని కాపాడుకోవడం మనిషి బాధ్యత.
బతుకునిచ్చిన నదీమా తల్లికి ఒక్కసారైనా నమస్కరించడం బిడ్డల బాధ్యత. కొండకోనల్లో బతికే అడవిబిడ్డెలు నిత్యం చేసేది అదే. కాలం కార్పొరేట్ రెక్కలు తొడుక్కొని గ్లోబల్ విలేజ్ చుట్టూ గిరికీలు కొడుతున్న తరుణమిది. మనిషి ప్రకృతిని పీడిస్తూ బతుకుతున్న సమయమిది.
ఈ సందర్భంలో నది ముందు మళ్లీ కామన్ మ్యాన్ తలవంచి నమస్కరించాడు. పాపం, పుణ్యం పక్కన పెడితే ప్రకృతిలో కలిసిపోతున్నాడు. తల్లి గోదావరికి, తెలంగాణది పేగుబంధం. ఈ తల్లి ఎద మీద బతుకుతున్న బిడ్డెలకు గోదావరంటే పుట్టెడు యిష్టం. కోటి మొక్కులు మొక్కి సల్లగ జూడుమంటరు.
తడి ఆరని తండ్లాటను ఒడిసిపట్టుకుంది. సజీవంగా భవిష్యత్ తరాల కోసం భద్రం చేసింది. పుష్కరాలు ముగిసినా సరే ఈ దృశ్యాలు ఇంకా మనముందు పచ్చిపచ్చిగా కదలాడుతుంటాయి. పుష్కరాలకు వెళ్లని వాళ్లకు సైతం ఓ మధురానుభూతిని మిగులుస్తాయి.
పుట్టుక, చావు, నవ్వు, ఏడుపు, కోపం, శాంతం వంటి అనేక మానవ సంవేదనల్ని ఫొటోలో బంధించడం కళాత్మక క్రియ. ఆ పనిని భుజానేసుకొని బాసర నుంచి భద్రాచలం వరకు ఓ కళాకారుడు అచ్చం గోదావరిలాగే ఆగని ప్రయాణం చేశాడు.
అదిగో ఆ జానజాతర నదికి నమస్కరిస్తుంటే, తాను మాత్రం ఆ మట్టి మనుషులకు అభివందనం చేశాడు. నిండు గోదావరితో మూడేసుకున్న జీవన దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఆ కెమెరా కంటి పేరే ఎం. అర్జున్.
అర్జున్కు ప్రకృతి అన్నా, మట్టి మనుషులన్నా ఎనలేని పాయిరం. అందుకే ప్రకృతికి, మనిషిని తల్లిబిడ్డల్లా భావిస్తాడు. పుష్కరాల్లో నదిని చూస్తే అందరికీ భక్తి గుర్తొస్తే, అర్జున్కు మాత్రం తల్లిబిడ్డల బంధం గుర్తొచ్చింది. ఆ బంధాన్ని మరింత సజీవమయం చేయడానికి శ్రమించాడు.
బతుకును, భవిష్యత్తును భక్తిలో చూసుకునే సామాన్యుల అనేక హావభావాలను కెమెరాలో బంధించి మన ముందుకు తెచ్చాడు. ఈ దృశ్యాలు మనల్ని మళ్లీ గోదావరి ఒడ్డుకు తీసుకుపోతాయి. పుష్కరాలు ఎలా జరిగాయో, మట్టి మనుషులు ఎలా భక్తిపారవశ్యంలో మునిగితేలారో మన చెయ్యిపట్టుకొని తీసుకపోయి చూపిస్తాయి.
కాసేపు మనల్ని ఓలలాడించి, గమ్మత్తైన ఫీలింగ్ను గుండెల నిండా నింపుతాయి. ఫొటోగ్రఫీతో తెలంగాణ ఖ్యాతిని దశదిశలకు చాటినవారి సరసన నా మిత్రుడు అర్జున్ కూడా నిలుస్తాడని, నిలబడాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
-
డాక్టర్
పసునూరి
రవీందర్,
కవి,
రచయిత,
కేంద్ర
సాహిత్య
అకాడెమి
యువ
పురస్కార
గ్రహీత.