సారిక మృతిపై గుట్టుగా దర్యాప్తు: రెండు రోజులుగా సనాను ప్రశ్నిస్తున్న పోలీసులు?
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతి కేసులో పోలీసులు గుట్టుగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. గత రెండు రోజులుగా సారిక భర్త అనిల్ రెండో భార్య సనాను వరంగల్ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
కాకతీయ విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) క్యాంపులో సనాను నుంచి వివరాలు సేకరిస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో సనాను పోలీసులు నాలుగో నిందితురాలిగా చేర్చారు.
వారిపై వరకట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రోత్సహించడం వంటి సెక్షన్ల కేసులు నమోదు చేశారు. సంఘటన జరిగిన రోజునే రాజయ్యను, ఆయన భార్య మాధవిని, అనిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్నాడు కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. సంఘటన జరిగిన రోజు నుంచి సనా పరారీలో ఉన్నారు.
ఆమెను పోలీసులు ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సనా ఇంకా పరారీలోనే ఉందని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. అయితే, ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడం విశేషం.
కాగా, అనిల్త జీవించడం తన వల్ల కాదని అంటూ తనకు న్యాయం చేయాలని సనా కొన్ని నెలల క్రితం రాజయ్య వద్దకు వచ్చి పంచాయతీ పెట్టినట్లు చెబుతున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య రూ.10లక్షలు సనాకు చెల్లించడానికి ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు.
సారిక, ముగ్గురు పిల్లల మృతికీ, ఆస్తి తగాదాలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తు్నారు. వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగిన విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సనాను ప్రశ్నించి రిమాండ్ చేసిన తర్వాత పోలీసులు రాజయ్య, మాధవి, అనిల్లను తమ కస్టడీకి కోరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.