లంచం లేనిదే పని జరగదా?తెలంగాణ లక్ష్యం ఇదేనా.?అవినీతికి అమాయకులు అంతమవుతున్నారన్న పొన్నాల.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఘాటు విమర్శలు చేసారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి ప్రతిష్టాత్మక ప్రసంగాలు చేసే సీఎం చంద్రశేఖర్ రావుకు, అదే డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం జరుగుతున్న అవకతవలు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖను సంప్రదించాలన్నా లంచావతారులు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని, లంచం లేనిదే ఏ పని జరగడం లేదని, చివరకు ప్రభుత్వ పథకాలను పొందేందుకు కూడా లంచాలు ఇవ్వలేక సామాన్యులు సతమతమవుతున్నారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేసారు.

లంచాల రాష్ట్రంగా తెలంగాణ.. మండిపడ్డ పొన్నాల
సిద్దిపేటలో రమేష్ అనే వ్యక్తి ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇంటి కోసం లంచం ఇవ్వలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు మాజీ కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం లక్ష లంచం అడిగినందుకు సూసైడ్ చేసుకోవడం ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతుందని ఆవేదన వ్యక్తం చేసారు పొన్నాల. చనిపోయే ముందు ఎవ్వరూ అబద్దం ఆడరని, సాధారణ గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే, పేదల పట్ల రాష్ట్ర పాలన ఏవిధంగా ఉందో తెలిసిపోతుందన్నారు.

ప్రభుత్వ పధకాలకు కూడా లంచాలా.? విచారకరమన్న మాజీ మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని సీఎం చంద్రశేఖర్ రావుపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేసారు.సీఎం ఇలాకాలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉందో అర్ధం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేసారు పొన్నాల. రాష్ట్రంలో పూర్తి స్తాయిలో ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, మళ్లీ ఖాళీ స్థలం ఉంటే డబ్బులిస్తామని మరో కొత్త మోసానికి తెలంగాణ ప్రభుత్వం తెర తీసిందని ధ్వజమెత్తారు పొన్నాల.

సీఎం ఇలాకాలోనే ఆత్మహత్యలు.. అవినీతిపై సీఎం దృష్టి పెట్టాలన్న పొన్నాల
అంతే కాకుండా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరపడిందని, సీఎం చంద్రశేఖర్ రావు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని కొత్తనాటకాలకు శ్రీకారం చుట్టారని మండి పడ్డారు. కరెంట్ కొనుగోలులో కూడా మతలబు ఉందని, తెలంగాణ ప్రజల సొమ్మును సీఎం దోపిడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. సింగరేణిలో కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తానని చెప్పడం వెనక పెద్ద స్కామ్ ఉందనే సందేహాన్ని పొన్నాల వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు కొత్త టెక్నాలజీ అంటే అది తప్పకుండా మోసపూరితమనే అంశాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాలన్నారు.

అన్నీ భ్రమలే.. తెలంగాణ సీఎం కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న మాజీ మంత్రి పొన్నాల
పరిశ్రమలకంటే వ్యవసాయరంగానికే కరెంట్ చార్జీల భారం ఎక్కువగా మోపుతున్నారని, కరెంట్ చార్జీలు కట్టని ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉన్నాయన్నారు పొన్నాల. విద్యుత్ శాఖ అప్పుల్లో ఉందని చెప్పిన చంద్రశేఖర్ రావు, సర్కార్ పెండింగ్ బిల్స్ కట్టించడంలో ఎందుకు ఆదేశాలు జారీ చేయడంలేదో వివరించాలన్నారు. మళ్లీ కొత్త ప్లాంట్ అంటే ప్రజలు ఎలా నమ్ముతారనన్నారు. హైదరాబాద్ లో మెట్రో ఓల్డ్ సిటీ నుండి పోకుండా అడ్డుకుంది కమిషన్ ల కోసమేనని పొన్నాల ఘాటు ఆరోపణలు చేసారు. మూడు సంవత్సరాలు ఆపడం వల్ల 4000కోట్లు అధికభారం పడిందని, మళ్లీ ఇప్పుడు చంద్రశేఖర్ రావు మెట్రో సేవలు పొడగింపు అంటుండం హాస్యాస్పదంగా ఉందన్నారు పొన్నాల లక్ష్మయ్య.












Click it and Unblock the Notifications