తెలంగాణలో కరెంట్ ఛార్జీల మోత: ఎంత పెంపు అంటే..?
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. 6 వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. గృహ వినియోగదారులపై యూనిట్పై 50పై., వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చార్జీల వాత తప్పదని అర్థం అవుతుంది.
ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్లకు 10 వేల కోట్ల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించింది. ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా.. ఈ భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది.
ఎల్.టీ కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా...రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్కు రూ. 2 సబ్సిడీ ఉంది. రైల్వే చార్జీలు, బొగ్గు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని టీఎస్ ఎస్పీడిఎసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్తున్నారు.
ఇటు బొగ్గు ధరలను ఆరు నుంచి పది శాతం పెంచడంతో డిస్కమ్లపై ప్రతి సంవత్సరం అదనంగా రూ.725 కోట్ల భారం పడుతోంది. గత నాలుగు ఏళ్లలో బొగ్గు రవాణా రైల్వే ఛార్జీలు 40 శాతం మేర పెరిగాయని చెబుతోంది. డిస్కమ్లపై భారాన్ని తగ్గించేందుకు విద్యుత్ ఛార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.పవర్ బిల్లులతో సామాన్య, మధ్య తరగతి జనం ఇబ్బందులు పడతారు. కరోనా వల్ల కొందరికీ ఉపాధి కూడా సరిగా లేదు.